ఒకటి కాదు, రెండు కాదు పది లక్షల కోట్ల లూటీ

x
Highlights

జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి...డబ్బులతో నింపండి....అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగానే పిలుపునిచ్చారు. పాపం జనం కూడా ప్రధాని మాట విని, బ్యాంకుల్లో డబ్బు జమ...

జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి...డబ్బులతో నింపండి....అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగానే పిలుపునిచ్చారు. పాపం జనం కూడా ప్రధాని మాట విని, బ్యాంకుల్లో డబ్బు జమ చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో పెద్ద మొత్తంలో అకౌంట్లలో వేశారు. ఇప్పుడు ఆ అకౌంట్లే లక్ష్యంగా బడాబడా పారిశ్రామిక దొంగలు దోచుకెళ్తున్నారు. నిన్న విజయ్ మాల్యా, నేడు నీరవ్‌ మోడీ, రేపు ఇంకెందరో...ఇలా లెక్కేసుకుపోతే, పారిశ్రామికవేత్తలు బ్యాంకులను దోచేసింది ఎంతో తెలుసా...

అక్షరాలా పది లక్షల కోట్ల రూపాయలు. పేరుమోసిన పారిశ్రామికవేత్తలు కొల్లగొట్టిన మొత్తమిది. పది లక్షల కోట్లు అంటే, మన వార్షిక బడ్జెట్‌లో సగం. దేశంలో పది రాష్ర్టాల వార్షిక బడ్జెట్‌తో ఇది సమానం. తాజాగా బయటపడ్డ నీరవ్‌మోడీ, విక్రం కొఠారీల లెక్కలు కాకుండా భారత రిజర్వ్ బ్యాంకు తేల్చిన చిట్టాపద్దులివి.

టాప్‌ ఫైవ్‌ డిఫాల్టర్లు. టాప్‌ ఐదుగురు బ్యాంకులకు ఎగనామం పెట్టిన డబ్బెంతో తెలుసా...లక్ష కోట్లు.

విన్‌సమ్‌ డైమండ్స్ అండ్ ఫరెవర్ ప్రీసియస్ జువెల్లరీ ప్రమోటర్‌ జతిన్‌ మెహతా బ్యాంకులకు బాకీపడింది 5,500 కోట్లు. విజయ్‌ మాల్యా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం తీసుకున్న 3 వేల కోట్లకు గుండుసున్నా చుట్టాడు. కింగ్‌ఫిషర్‌తో కలుపుకుంటే, మాల్యా ముంచేసిన మొత్తం తొమ్మిదివేల కోట్లు.

ఆర్‌ఈఐ ఆగ్రో అధినేత సందీప్ ఝన్‌ఝన్‌వాలా 2,730 కోట్లకు దిక్కుదివానం లేదు. మెహువా మీడియా అధినేత పీకే తివారి ఫ్యామిలీ, వ్యాపార అభివృద్ది కోసం తీసుకున్న లోన్‌ 2,416 కోట్లు. ఇప్పటికీ బ్యాంకులకు పైసా కట్టడం లేదు. ఇక టాప్‌ఫైవ్‌లో లాస్ట్‌ డిఫాల్టర్ జూమ్ డెవలపర్స్...2,371 కోట్లు అప్పు తీసుకుని, అసలు బ్యాంకు ముఖం చూడ్డం లేదు.

నీరవ్‌ మోడీ పీఎన్‌బీ సహా పలు బ్యాంకులకు 12 వేల కోట్లు ముంచేసి, ఎంచక్కా విదేశాలకు చెక్కేశాడు. ఇక రొటోమాక్‌ సంస్థ అధినేత విక్రమ్‌ కొఠారీ 800 కోట్లు లోన్లు తీసుకుని, ఎగ్గొట్టాడు.

సొమ్మొకడిది, సోకొకడిది అంటే ఇదేనేమో. బ్యాంకుల్లో వేసేదేమో సామాన్యులు. వాటిని దోచుకునేదేమో సామంతులు, పారిశ్రామికవేత్తలు. ప్రజలు తమపై ఉంచిన అపార నమ్మకాన్ని బ్యాంకులు కంపెనీలకు తాకట్టు పెడుతున్నా యి. సామాన్యుడు అప్పుకోసం వస్తే, సవాలక్ష ఆంక్షలు పెట్టే బ్యాంకు అధికారులు సూటుబూటు వ్యాపారులను మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నాయి. సామాన్యు డు దాచుకొన్న డబ్బు అప్పనంగా బడా కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలన్న చందంగా, సామాన్యుల సొమ్ము సామంతుల వశమవుతోంది.

ఎందరో దొంగలు. జనాల సొమ్ముకు కన్నం వేశారు. మరెన్నో కంపెనీలు. అప్పనంగా బ్యాంకులను కొల్లగొట్టాయి. డబ్బులు ఎగ్గొట్టిన ఆ కంపెనీల నామధేయాలంటే వింటారా. పేరుకు మాత్రం గొప్ప కంపెనీలు. కానీ వ్యాపార అభివృద్ది కోసం, బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు మాత్రం తీర్చవు. అలా వందల కంపెనీలో ఇండియాలో ఉన్నాయి. అందులో టాప్‌ 12 కంపెనీలు ఏవంటే.

టాప్‌ 12 డిఫాల్టర్‌లు
భారత్‌ స్టీల్‌ లిమిటెడ్..................................44,478 కోట్లు
ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్...................44,364 కోట్లు
ఎస్సార్‌ స్టీల్ లిమిటెడ్....................................37, 284 కోట్లు
భూషణ్‌ పవర్ అండ్ స్టీల్...........................38,000 కోట్లు
అలోక్ ఇండస్ట్రీస్............................................22,000 కోట్లు
ఆమ్‌టెక్‌ ఆటో లిమిటెడ్............................14,000 కోట్లు
మన్నెత్ ఇస్పాత్ లిమిటెడ్............................10,000 కోట్లు
ఎలక్ట్రో స్టీల్ లిమిటెడ్.................................10,000 కోట్లు
ఎరా ఇన్‌ఫ్రా కంపెనీ................................10,273 కోట్లు
జైపీ..................................................................9,700 కోట్లు
ఏబీజీ షిప్‌యార్డ్.....................................6,900 కోట్లు
జ్యోతి స్ట్రక్చరల్.............................................5,165 కోట్లు

ఇవే కాకుండా దాదాపు 45 కంపెనీలు వందల కోట్ల అప్పు తీసుకుని, బ్యాంకులను నష్టాల ఊబిలోకి నెట్టాయి. మూతపడ్డానికి కారణమవుతున్నాయి. వీటిలో మన తెలుగు కంపెనీలు కూడా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు బ్యాంకులను ముంచిన మొత్తం రూ. 50వేల కోట్ల పైమాటేనని లెక్కతేల్చింది ఆర్బీఐ. ఇందులో సింహభాగం హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌దే. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ బ్యాంకులకు ఎగవేసిన రుణం మొత్తం రూ.44 వేల కోట్లని చెప్పింది ఆర్బీఐ.

దేశవ్యాప్తంగా తాము చెల్లించలేమని పూర్తిగా చేతులెత్తేసిన సుమారు 36 కంపెనీల నుంచి సొమ్మును వసూలు చేసే బాధ్యతను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు అప్పగించింది ఆర్బీఐ. కానీ వసూలు చేస్తాయా అన్నది అనుమానమే. లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, విక్రమ్ కొఠారి, రేపు మరొకరు. ఇలా జనం దాచుకున్న డబ్బును దోచుకునే దొంగలు రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుని, విదేశాలకు ఎగిరిపోయిన రాబంధులను వెనక్కి రప్పించాలి. ప్రజాధనాన్ని కక్కించాలి. బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుంటే, అభద్రత కాదు, భద్రతని భరోసానివ్వాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories