కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మించాలన్న తెలంగాణ సర్కారు కల కలగానే మిగలబోతోందా..? సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్స్ లో అత్యాధునిక హంగులతో శాసన సభ,...
కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మించాలన్న తెలంగాణ సర్కారు కల కలగానే మిగలబోతోందా..? సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్స్ లో అత్యాధునిక హంగులతో శాసన సభ, సెక్రటేరియట్ కట్టాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష నేరవేరే ఛాన్సు లేదా..?విపక్షాలు కోరుకుంటున్నట్లు బైసన్ పోలో గ్రౌండ్స్లో సచివాలయ నిర్మాణ ప్రతిపాదన అటకెక్కిందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.
రక్షణ శాఖ ఆధీనంలోని బైసన్ పోలో గ్రౌండ్ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే పనుల్లో ప్రతిఫ్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సానుకూలంగా సాగిన చర్చలు తాజాగా విఫలమైనట్లు సమాచారం. కొత్త అసెంబ్లీ, సచివాలయం కాంప్లెంక్స్ నిర్మాణం కోసం బైసన్ పోలో గ్రౌండ్ ను అప్పగించడానికి రక్షణ శాఖ పెట్టిన ఓ షరతే ఇందుకు కారణం. మొత్తం 3 షరతులకు గానూ ఓ షరతు దగ్గర చర్చలు ఫెయిలైనట్లు తెలుస్తోంది.
బైసన్ పోలోగ్రౌండ్ ను అప్పగించడానికి రక్షణ శాఖ మొత్తం 3 షరతులు విధించింది. బైసన్ పోలోకు ప్రత్యామ్నాయంగా రక్షణ శాఖకు నగర శివార్లలో 5 వందల ఎకరాలు కేటాయించాలనేది మొదటి షరతు. బైసన్ పోలో గ్రౌండ్ వదులుకున్నందుకు ప్రతిగా ఒకేసారి 92 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది రెండో షరతు. ఇక రాష్ట్రప్రభుత్వం ప్రతిఏటా రక్షణ శాఖకు 60 కోట్ల నష్టపరిహారం చెల్లించాలనేది ఇక మూడో షరతు. మొదటి రెండు ప్రతాపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చెప్పినా మూడో కండిషన్ కు మాత్రం నో అంది. ప్రతిఏటా 60 కోట్లు ఇవ్వాలన్న నిబంధనను టీఆర్ఎస్ సర్కార్ తిరస్కరించింది.
బైసన్ పోలో గ్రౌండ్ లో ప్రస్తుతం ఉన్న భవంతులు, ఫంక్షన్ హాల్స్ అద్దెల ద్వారా ఏటా 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని రక్షణ శాఖ చెబుతోంది. బైసన్ పోలో గ్రౌండ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఆ ఆదాయం పోతుంది కాబట్టి ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చెయ్యాలని కోరుతోంది. కానీ ప్రతి ఏటా 60 కోట్లు ఇవ్వడం తమకు భారమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే విషయం దగ్గర చర్చల్లో పీటముడి పడింది. దీంతో ఎవరు మెట్టు దిగుతారు..అసలు బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త అసెంబ్లీ, సచివాలయం కాంప్లెంక్స్ నిర్మాణం జరుగుతుందా..? లేదంటే... ప్రత్యామ్నాయ స్థలం వెతుక్కోక తప్పదా అనే అనుమానాలు ఏర్పడ్డాయి.
బైసన్ పోలో గ్రౌండ్ విషయంలో రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి చర్చలు విఫలమయ్యాయని తెలుసుకున్న టీఆర్ఎస్ ఎంపీలు.. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే టీఆర్ఎస్ ఎంపీల వినతిని నిర్మల సున్నింతగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. నష్టపరిహారం విషయంలో జోక్యం చేసుచేసుకోలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం.
నిజానికి ప్రస్తుత సచివాలయ భవనాలు జిగ్ జాగ్ గా ఉండడంతో పాటు అసెంబ్లీ భవనం పాతది కావడంతో సీఎం కేసీఆర్ కొత్త కాంప్లెక్స్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాలకు ప్రధానితో శంకుస్థాపన చేయిస్తానని ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పాత భవనాల వాస్తు బాగోలేదనే కారణంతో కేసీఆర్ భారీ వ్యయంతో కొత్త నిర్మాణాలు తలపెట్టారని ఆరోపించాయి. కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాలు ఆందోళనలు కూడా చేశాయి.
పైగా బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణం వద్దంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి చాలా ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన పీఎంవో తగిన వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించించి. ఒక్కో ఫిర్యాదుకు విడివిడిగా వివరణ పంపాలని కోరింది. మొత్తంగా వివాదాస్పందంగా మారిన కొత్త అసెంబ్లీ, సచివాలయ కాంప్లెంక్స్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire