
బ్యుటీషియన్ జ్యోతి మృతి కేసు విచారణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. దర్యాప్తు ముమ్మరం చేశామంటున్న పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. జ్యోతి...
బ్యుటీషియన్ జ్యోతి మృతి కేసు విచారణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. దర్యాప్తు ముమ్మరం చేశామంటున్న పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. జ్యోతి ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిందా..? లేదా ఎవరైనా తోసేశారా..? ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు.. లవర్ సందీప్కు నిజంగానే ప్రమేయం ఉందా..? ఆ రోజు జ్యోతి వెంట ఎవరైనా ఉన్నారా..? అసలు సోమవారం నాడు ఏం జరిగింది..? ఇప్పటివరకు సమాధానం దొరకని ఈ ప్రశ్నల చుట్టే.. పోలీసుల విచారణ సాగుతోంది.
గత సోమవారం వికారాబాద్ జిల్లా మైలారం రైల్వేస్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన బ్యుటీషియన్ జ్యోతి కేసు దర్యాప్తులో.. పోలీసులు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయారు. ఇప్పటికే జ్యోతి కాల్డేటాను పరిశీలించిన పోలీసులు.. ఆదివారం ఆమె లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన సమయంలో ఆమెతోపాటు ఎవరైనా ఉన్నారా..? లేదా ఆమెను ఎవరైనా ఫాలో అయ్యారా..? అనే విషయాలపై స్పష్టత కోసం స్టేషన్ లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు.
లింగంపల్లిలో గుల్బర్గా ప్యాసింజర్ ఎక్కిన జ్యోతి మైలారం రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపక్కన పడి ఉంది. జ్యోతికి ఆ మార్గంలోని అన్ని స్టేషన్లపై మంచి అవగాహన ఉందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాబట్టి.. మైలారం రైల్వేస్టేషన్ను రుక్మాపూర్గా భావించి దిగడానికి అవకాశమే లేదని పోలీసులు భావిస్తున్నారు. ఇక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో జ్యోతిని సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడానికి గల కారణాలను కూడా అన్వేషిస్తున్నారు. ఆ రాత్రి ఎవరైనా ఆమెపై ఏదైనా దారుణానికి ఒడిగట్టి.. ఉదయం వదిలేశారా..? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆమె శరీరంపై బలమైన గాయాలు లేకపోవడంతో ఆత్మహత్య కాదనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక అందరూ అనుమానిస్తున్నట్టుగా జ్యోతి ప్రియుడు సందీప్ పాత్రేంటనేది ఆసక్తికరంగా మారింది. తొలుత అజ్ఞాతంలో ఉన్న సందీప్.. మీడియా ద్వారా తన గోడును వెళ్లబోసుకున్నాడు. జ్యోతి మరణం కుంగదీసిందంటున్న సందీప్.. ఆదివారం రాత్రి రైలెక్కేముందు ఆమెతో ఫోన్లో మాట్లాడానని చెప్పాడు. రుక్మాపూర్ స్టేషన్లో దిగగానే ఫోన్ చేస్తానని చెప్పిన జ్యోతి నుంచి.. కాల్ రాకపోయే సరికి.. కంగారుపడ్డట్లు వివరించారు. తర్వాత తన ఫ్రెండ్తో బైక్ పై వెళ్లినట్లు చెబుతున్న సందీప్.. జ్యోతి అన్న గోపాల్ తో కలిసి.. చాలాచోట్ల గాలించినట్లు వివరించాడు. దీంతో రాత్రి ఒంటిగంటన్నరకు తాండూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెబుతున్నాడు. ఏదేమైనా.. ఎన్నో అనుమానాల చుట్టూ తిరుగుతున్న బ్యుటీషియన్ జ్యోతి డెత్ మిస్టరీ.. ఎప్పుడు ఛేదిస్తారనేదే ఆసక్తికరంగా మారింది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire