వైసీపీ, జనసేన.. బీజేపీ కోవర్టులు

arun
By arun
Updated on: 24 Dec 2018 1:08 PM IST
వైసీపీ, జనసేన.. బీజేపీ కోవర్టులు
X

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇవాళ లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు.. టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో చర్చను అడ్డుకుంటున్న అన్నాడీఎంకే, టీఆర్ఎస్ వ్యవహార శైలి గురించి చర్చించారు. సభలో ప్రతీ నిముషం అప్రమత్తంగా ఉండాలని.. విపక్ష సభ్యులంతా మనకు మద్దతిస్తారని తెలిపారు. అందరితో సమన్వయం చేసుకుని సభలో వ్యవహరించాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

అటు జనసేన అధినేత పవన్ వ్యాఖ్యల గురించి కూడా చంద్రబాబు ఎంపీలతో ప్రస్తావించారు. తనకు, ప్రధాని మోడీకి మధ్య విభేదాలు ఉన్నాయని, అందువల్లే తనకు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. తనకూ మోడీకి మధ్య ఉన్న విభేదాలపై ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. బీజేపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీల ఎజెండా ఒక్కటే అన్న చంద్రబాబు.. వైసీపీ, జనసేన బీజేపీ కోవర్టులని వ్యాఖ్యానించారు. పవన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ఎవరికి మేలు చేయాలని పవన్ భావిస్తున్నారో అర్థం కావడం లేదని.. ఎప్పుడో ఏళ్ల క్రితం గోద్రా ఘటనలు జరిగినప్పుడు అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని తాను విమర్శించానని, అది అప్పటికే పరిమితమన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా నేతలకు సూచించారు.

ప్రతీ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. కుట్రలను ఎదుర్కోవడం తెలుగుదేశానికి కొత్తేం కాదని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. టీడీపీ ధర్మం కోసం పోరాడుతుంటే కొందరికిఅది... యుద్ధంలా కనిపిస్తుందని అన్నారు. మనకు రావాల్సిన హక్కుల కోసం అడుగుతున్నామని.. అందులో తప్పేంటని ప్రశ్నించారు. ఏపీ పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఇదేనా అని.. చట్టం అమలు తీరు ఇలాగే ఉంటుందా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.

arun

arun

Next Story