ఆ నవ్వులు మనసును దోచేస్తాయి..... చిన్నిచిన్ని చేతులు ఊపుతూ.... ముద్దు బొద్దుగా ఉండే ఆ పాపను చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది.... ఎత్తుకుని...
ఆ నవ్వులు మనసును దోచేస్తాయి..... చిన్నిచిన్ని చేతులు ఊపుతూ.... ముద్దు బొద్దుగా ఉండే ఆ పాపను చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది.... ఎత్తుకుని ఆడించాలనిపిస్తుంది.... కానీ మీరు చూస్తున్నది ఏడాది పాపను కాదు.... ముప్ఫై ఏళ్ల యువతిని.... అవును మీరు వింటున్నది నిజమే... మీరు చూస్తున్న ఈ అమ్మాయి చిన్నారి కాదు.... 30ఏళ్ల యువతి.... భగవంతుడు చల్లగా చూసుంటే మరో ఇద్దరు చిన్నారులకు తల్లి కావాల్సిన ఈమె.... ఇప్పటికీ తన తల్లి ఒడిలో పసిపాపగానే మిగిలిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం గోర్స గ్రామానికి చెందిన కేశబోయిన అప్పారావు, నాగరత్నం దంపతులకు నలుగురు కూతుళ్లు. రెండో కుమార్తె దుర్గ. ఈమెకు పుట్టుకతోనే అకొండ్రోప్లేసియా వ్యాధి సోకింది. అంతే దుర్గ శరీరంలో ఎదుగుదల లోపించింది. అన్ని అవయవాలూ కుచించుకుపోయాయి. శారీరక, మానసిక ఎదుగుదల లోపించింది. మెదడు సైతం ఎదగక పోవడంతో 30ఏళ్లు వచ్చినా పసిపాపగానే మిగిలిపోయింది.
తల్లి, అక్కచెల్లెళ్లు, తండ్రిని గుర్తించే దుర్గ.... ఏడాది వయసున్న పసిపాపగానే మిగిలిపోయింది. నడవ లేదు... ఆకలేస్తే అడగలేదు... బాధ కలిగినా దుఖం వచ్చినా చెప్పుకోలేదు... 30ఏళ్లుగా దుర్గ దీనస్థితి ఇది.... అన్నం పెట్టినా.... స్నానం చేయించినా.... బట్టలు తొడగాలన్నా, బయటికి తీసుకెళ్లాలన్నా.... ఇలా అన్నింటికీ అమ్మే.... కాలకృత్యాలు చేసుకుంటే పసిపాపలా శుభ్రం చేయాల్సిందే.... పెళ్లి చేసి అత్తారింటిని పంపాల్సిన కూతురు ఇప్పటికీ తన ఒడిలోనే ఆడుకుంటూ.... అన్ని అవసరాలకూ తనపైనే ఆధారపడి ఉండటంతో తల్లి అంతులేని ఆవేదన అనుభవిస్తోంది.
30ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పసిపాపగానే మిగిలిపోయిన దుర్గను తల్లి అలుపన్నది లేకుండా సాకుతోంది. నడవలేని 30ఏళ్ల కూతుర్ని చంకనెత్తుకుని తిరుగుతోంది.... నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.... తాను ఎక్కడికి వెళ్లినా తనతోనే తీసుకెళ్తుంది.... గుండెకోత భరిస్తూ ఆమె ఆలనాపాలన చూస్తోంది.... కూలీ పనులు చేసుకుంటూ బతికే దుర్గ తల్లిదండ్రులు పెద్దల్లుడి దగ్గరుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తామున్నంత వరకూ దుర్గను కంటికి రెప్పలా కాపాడుకుంటామంటున్న తల్లి నాగరత్నం.... తామిద్దరూ పోయాక తన కూతురు గతేమిటని కన్నీళ్లు పెట్టుకుంటోంది.
దుర్గకు సోకిన వ్యాధిని వైద్య పరిభాషలో అకొండోప్లేసియా అంటారు. దీనివల్లే మరుగుజ్జు వస్తుంది. కానీ దుర్గ విషయంలో శరీరంతోపాటు మెదడు ఎదుగుదల కూడా లోపించింది. దాంతో ఆమె మానసిక స్థితి కూడా ఏడాది వయసు దగ్గరే ఆగిపోయింది. తన వాళ్లను గుర్తుపట్టగలదు కానీ మాట్లాడలేదు.... చివరికి ఆకలేసినా, బాధ కలిగినా చెప్పుకోలేని పరిస్థితి.... అయితే దుర్గను చిన్నతనంలోనే డాక్టర్లకు చూపించామని... కానీ వైద్యం లేదని తేల్చేశారని తల్లి నాగరత్నం తెలిపింది. ప్రభుత్వం వచ్చే వికలాంగ ఫించన్తోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నామంటున్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire