నగదు కావాలంటే... నడక సాగాల్సిందే

విశాఖపట్నం: మౌలిక సదుపాయలు, రవాణా సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడే విశాఖ గిరిజనులకు కొత్తగా ఓ సమస్య వచ్చి పడింది. కరోనా సాయం, పింఛను, ఉపాధి హామీ పనులు... ఇలా ప్రతి పథకానికి సంబంధించిన నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఖాతాల్లో పడిన నగదు విత్‌డ్రా చేసుకోవటానికి స్థానికంగా ఏటీఎమ్​లు ఉండట్లేదు. ఆధార్‌ అనుసంధానంతో పనిచేసే పేటీఎం, ఎయిర్‌టెల్‌ బ్యాంకు వంటి సేవలను కొంతమంది యువత స్థానికంగా అందిస్తున్నప్పటికీ... కమిషన్‌ రూపంలో కొంత సొమ్మును పోగొట్టుకోవాల్సి వస్తోంది. కమిషన్‌ పోయినా నగదు అంత సులభంగా చేతికి రాక ఇబ్బందులు పడుతున్నారు.

మారుమూల ప్రాంతమైన డుంబ్రిగుండ మండలం కిరిడివలసకు చెందిన చిన్నమ్మి అనే వృద్ధురాలు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఖాతాలో ఇటీవల జమ అయిన ఉపాధి హామీ కూలీ డబ్బులు తీసుకుందామంటే బయోమెట్రిక్‌ తప్పనిసరిగా వేయాలి. అత్యవసర సమయాల్లో మొబైల్‌ సిగ్నల్‌ కోసం ఎత్తుగా ఉన్న ప్రాంతాలకు స్థానికులు పరుగులు పెట్టినట్లుగా ఆమె వెళ్లలేక సాయం కోసం ఎదురుచూశారు. చివరికి కుటుంబసభ్యులే 5 కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతానికి డోలీలో ఆమెను మోసుకుపోయారు. అక్కడ సిగ్నల్‌ వచ్చాక బయోమెట్రిక్‌ వేసి ప్రైవేటు బ్యాంకు సర్వీసు అందిస్తున్న యువత నుంచి నగదు తీసుకున్నారు. మారుమూల గ్రామాల్లోనే ఈ పరిస్థితి ఉందని గిరిజనులు వాపోయారు. మండల కేంద్రాల్లోని ఏటీఎమ్​ల నుంచి యువత పెద్దసంఖ్యలో నగదు విత్‌డ్రా చేసి.. మారుమూల గ్రామస్థులకు ఇస్తున్నారు. అవి అయిపోతే నడుచుకుంటూ మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మారుమూల గ్రామాల్లో నగదు పంపిణీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు కోరుతున్నారు.



 


Show Full Article
Print Article
Next Story
More Stories