Stock Market : స్టాక్ మార్కెట్ భారీ పతనానికి 5 ప్రధాన కారణాలు ఇవే..

Stock Market : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 2400 పాయింట్లు పడిపోవడానికి గల 5 ప్రధాన కారణాలు ఈ స్టోరీలో చూడండి.

Ganesh
Published on: 9 March 2026 4:53 PM IST
Stock Market
X

Stock Market : స్టాక్ మార్కెట్ భారీ పతనానికి 5 ప్రధాన కారణాలు ఇవే..

Stock Market : పశ్చిమాసియా (ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్) ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 50 దాదాపు 700 పాయింట్ల వరకు నష్టపోయింది.

మార్కెట్లు ఇంతలా కుప్పకూలడానికి గల ప్రధాన కారణాలు..

1. ఆకాశాన్ని తాకుతున్న ముడి చమురు ధరలు

అమెరికా-ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అతలాకుతలమైంది. బ్రెంట్ క్రూడ్ ధర 25% పెరిగి బ్యారెల్‌కు $116 కు చేరుకోగా, WTI క్రూడ్ కూడా $114 మార్కును దాటింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న 'స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో సరఫరా నిలిచిపోతుందనే భయాలు పెరిగాయి. ఇరాక్, కువైట్ వంటి దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది.

2. భారత్ పై ప్రభావం (చమురు దిగుమతులు)

భారతదేశం తన అవసరాలకు అవసరమైన 85% కంటే ఎక్కువ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే, కరెంట్ అకౌంట్ లోటు (CAD) పెరుగుతుంది, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ముంచుకొస్తుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యులపై భారం పడుతుంది. ఇది దేశ ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తుంది.

3. పాతాళానికి రూపాయి విలువ

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సోమవారం ఉదయం 46 పైసలు క్షీణించి 92.28కి పడిపోయింది. ఇది ఆల్-టైమ్ కనిష్ట స్థాయి అయిన 92.35కి అతి చేరువలో ఉంది. విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం (FII Outflows), డాలర్‌కు డిమాండ్ పెరగడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

4. కుప్పకూలిన అంతర్జాతీయ మార్కెట్లు

భారత మార్కెట్లపై గ్లోబల్ సెంటిమెంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జపాన్ నిక్కీ (7%), దక్షిణ కొరియా కోస్పీ (7%), తైవాన్ మార్కెట్ (6%) భారీగా నష్టపోయాయి. గత శుక్రవారమే వాల్ స్ట్రీట్‌లో ఎస్‌అండ్ పి 500, నాస్డాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి.

5. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల జోరు (FII Selling)

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే వీరు సుమారు రూ.6,030 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అస్థిరత పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే రోజుల్లో మార్కెట్ దిశానిర్దేశం పూర్తిగా పశ్చిమాసియా యుద్ధ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.

Ganesh

Ganesh

Next Story