
Mukesh Ambani: భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అంటే సాధారణంగా ఇంధనం, రిటైల్, టెలికాం పరిశ్రమల అధిపతిగానే చూస్తాం.
Mukesh Ambani: భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అంటే సాధారణంగా ఇంధనం, రిటైల్, టెలికాం పరిశ్రమల అధిపతిగానే చూస్తాం. కానీ, ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుల్లో ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న 'ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ ఆమ్రాయి' అనే మామిడి తోట పర్యావరణానికి మాత్రమే కాదు. భారతదేశం నుంచి అమెరికాకు అత్యధిక మామిడి పండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా మారింది.
మామిడి తోట కథ ఎలా మొదలైంది?
ఈ అద్భుతమైన మామిడి తోట కథ 1997లో ప్రారంభమైంది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న తమ రిఫైనరీ వల్ల కాలుష్యం జరుగుతోందని పర్యావరణ శాఖ నుంచి రిలయన్స్కు అనేక నోటీసులు రావడం మొదలైంది. అప్పుడు పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, భూమిని సద్వినియోగం చేసుకోవడానికి కంపెనీ ఒక పెద్ద అడుగు వేసింది. బంజరు భూమిలో మామిడి తోటను పెంచడం ప్రారంభించింది.
లక్షల మామిడి చెట్లు!
జామ్నగర్లోని భూమి మామిడి సాగుకు అనుకూలంగా లేదు. అక్కడి మట్టి ఉప్పుగా ఉండి నీటి నాణ్యత కూడా బాగోలేదు. కానీ రిలయన్స్ లేటెస్ట్ టెక్నాలజీ, డ్రిప్ ఇరిగేషన్, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఈ భూమిని పచ్చగా మార్చింది. నేడు ఇక్కడ లక్షల సంఖ్యలో మామిడి చెట్లు ఉన్నాయి. వీటి నుంచి ఏటా వేల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి.
అమెరికాకు అత్యధిక ఎగుమతులు
రిలయన్స్కు చెందిన ఈ తోటలో పండిన మామిడి పండ్లను అమెరికా, యూరప్, మధ్యప్రాచ్యం వంటి మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. ఒక్క అమెరికాకే ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో మామిడి పండ్లు పంపుతారు. దీనివల్ల భారతదేశ పండ్ల ఎగుమతులు కూడా బలపడతాయి. ఇది భారత్-అమెరికా వ్యవసాయ వాణిజ్యానికి కూడా ఊపునిచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం పర్యవేక్షణ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చూసుకుంటారు. తోట సంరక్షణతో పాటు, చుట్టుపక్కల రైతులకు టెక్నాలజీ సహాయం అందించడం, ఏటా 1 లక్ష మామిడి మొక్కలను పంపిణీ చేయడం కూడా ఈ ప్రాజెక్టులో భాగం.
అమెరికా ఏటా ఎంత మామిడిని కొనుగోలు చేస్తుంది?
ఆర్థిక సంవత్సరం 2024-25లో అమెరికా భారతదేశం నుండి దాదాపు 2,000 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను దిగుమతి చేసుకుంది. ఇది గత సంవత్సరం కంటే 130శాతం వృద్ధి. అంతకుముందు, 2022-23లో భారతదేశం నుంచి అమెరికాకు 813.5 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి అయ్యాయి.
ఈ ఎగుమతి వృద్ధి వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి ముంబైలో ఉన్న ఇర్రేడియేషన్ (irradiation) సదుపాయం. ఇది అమెరికా మార్కెట్ కోసం మామిడి పండ్లను ప్రాసెస్ చేసే అతిపెద్ద కేంద్రం. అయితే, మే 2025లో ఈ సదుపాయంలో డేటా రికార్డింగ్ లోపం కారణంగా మామిడి పండ్ల సరుకును అమెరికన్ అధికారులు తిరస్కరించారు. కానీ మే 10, 2025 నుంచి కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి. ఇతర రెండు ఆమోదిత సదుపాయాలపై ఎటువంటి ప్రభావం పడలేదు.
భారతదేశ మామిడి ఎగుమతులలో అమెరికా ఇప్పుడు ప్రధాన గమ్యస్థానంగా మారింది. గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది. ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 మధ్య భారతదేశం అమెరికాకు 24.97 మిలియన్ డాలర్ల విలువైన మామిడి పండ్లను ఎగుమతి చేసింది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు 20.78 మిలియన్ డాలర్ల విలువైన మామిడి పండ్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




