చైనా పై 'కరోనా' డేంజర్ బెల్స్..ఒక్కరోజే 28 లక్షల కోట్ల సంపద ఆవిరి!

చైనా పై కరోనా డేంజర్ బెల్స్..ఒక్కరోజే 28 లక్షల కోట్ల సంపద ఆవిరి!
x
Highlights

కరోనా వైరస్ చైనా ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేస్తోంది. ఒక పక్క వైరస్ ను ఎదుర్కొనేందుకు సర్కారు సతమతమౌతుంటే..మరోపక్క అంతర్జాతీయంగా చైనా పై...

కరోనా వైరస్ చైనా ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేస్తోంది. ఒక పక్క వైరస్ ను ఎదుర్కొనేందుకు సర్కారు సతమతమౌతుంటే..మరోపక్క అంతర్జాతీయంగా చైనా పై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. వైరస్ కారణంగా పెరిగిపోతున్న మృతుల సంఖ్య ఒకవైపు.. మూతపడుతున్న కంపెనీలు మరోవైపు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. పతనమవుతున్న చైనా యువాన్ విలువ ఇన్ని ఇబ్బందుల మధ్య చైనా అతలాకుతలం అయిపోతోంది.

పెరిగిపోతున్న మృతులు..

చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 361కి చేరింది. మరో 17,205 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరించారు. ఒక్క ఆదివారమే 2,829 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 186 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పటి వరకు 475 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ఈ నేపధ్యంలో చైనాలో చాలా మంది ప్రజలు బయటకు రావడం మానేశారు. రెస్టారెంట్లు..మార్కెట్లు వెలవెలా బోతున్నాయి. దీంతో అన్నీ మూతబడేస్థితికి వెళ్ళిపోతున్నాయి. కొనుగోలుదార్లు లేకపోవడంతో వ్యాపారులు ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయారు.

అంతర్జాతీయంగా ఆంక్షలు..

ఇక అంతర్జాతీయంగా క్రమేపీ చైనా పై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు చైనా నుంచి నేరుగా విమానాలు తమదేశానికి రాకుండా నిషేధం విధించాయి. చైనాతో రాకపోకల విషయంలో పూర్తిస్థాయిలో కొన్ని దేశాలు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీచేశాయి. ఇక చైనా వ్యాపార భాగస్వామ్య దేశమైన ఇండోనేషియా కూడా చైనా నుంచి కూల్డ్రింక్స్ వంటి ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేసింది. దీంతో పరిస్థితి ఇలానే కొనసాగితే ఇతర దేశాలూ ఇదే దారిలో నడవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్..

ఈక్రమంలో చైనా ఆర్థిక వ్యవస్థపై మునుపెన్నడూలేని విధంగా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ఆ దేశం స్టాక్ మార్కెట్ పేకమేడలా కూప్పకూలింది. ఒకే రోజు ఏకంగా 8 శాతం పతనమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.28 లక్షల కోట్లు ఆవిరైపోయింది. షాంఘై కంపొసైట్ ఇండెక్స్ ఈ స్థాయిలో పడిపోవడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి. చైనా స్టాక్ మార్కెట్‌లో 2,500కు పైగా స్టాక్స్ పడిపోయాయి. అది కూడా ఏకంగా 10 శాతం కుప్పకూలాయి. చైనా షాంఘై కాంపొసైట్ 7.7 శాతం పతనంతో 2,746 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్ట్ నెల నుంచి ఇదే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో మార్కెట్ 9 శాతం మేర క్షీణించింది.

ఇక మరోవైపు చైనా దేశ కరెన్సీ అయినా యువాన్ కూడా భారీగా నష్టపోయింది. ఒకే రోజులో 1.2 శాతం కుప్పకూలింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇప్పుడు చైనా యువాన్ 7.02 వద్ద ఉంది.

రంగంలోకి చైనా కేంద్ర బ్యాంక్

అదుపు తప్పుతున్న పరిస్థితులను చక్కబెట్టేందుకు చైనా కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగింది. రివర్స్ రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 1.2 ట్రిలియన్ యువాన్ల (173.81 బిలియన్ డాలర్లు) భారీ మొత్తంలో నిధులను వ్యవస్థలోకి తీసుకువచ్చింది. చైనా బ్యాంక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం 2004 నుంచి చూస్తే ఇదే ప్రథమం. అయినా, చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించినా కూడా స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల సునామీ ఆగలేదు. షాంఘై కాంపొసైట్ పతనానికి మాత్రం అడ్డుకట్ట పడలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories