కరెంటు తీగ పై పక్షి!

Arun Chilukuri
Published on: 7 Feb 2019 2:46 PM IST
కరెంటు తీగ పై పక్షి!
X

కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. అలాగే కొన్ని సార్లు మనిషి చనిపోవడం కూడా జరుగుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు, అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీరు మన దగ్గర వున్నా కరెంటు స్తంభాలను చూస్తే, ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభాలకు సాధారణంగా నాలుగు తీగలు ఉంటాయి. అందులో మూడు తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది. ఒక వ్యక్తిలోగానీ, వస్తువులో కానీ, జంతువులోగానీ విద్యుత్‌ ప్రవహించాలంటే దానికి అటూ ఇటూ విద్యుత్‌ పొటెన్షియల్‌ తేడా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి షాక్‌ కొట్టాలంటే ఏకకాలంలో కనీసం రెండు తీగలతో అనుసంధానం ఉండాలి. అప్పుడు అధిక పొటెన్షియల్‌ ఉన్న తీగలోకి, అల్ప పొటెన్షియల్‌ ఉన్న తీగ నుంచి ఎలక్ట్రాన్లు ఆ వ్యక్తి ద్వారా ప్రయాణిస్తాయి. ఇలా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తేనే ప్రమాదం. మనుషులు కూడా కేవలం ఒకే తీగను పట్టుకుని వేలాడితే ఏమీ కాదు. నేలను చెప్పుల్లేకుండా తాకితేనో, లేదా రెండు వైర్లను ఏకకాలంలో తగిలితేనో ప్రమాదం. పక్షుల విషయానికి వస్తే అవి ఒకే సమయంలో రెండు తీగలపై వాలవు. కాబట్టి వాటి దేహం ద్వారా విద్యుత్‌ ప్రవహించదు. పొరపాటున అది అటొక కాలు, ఇటొక కాలు ఒకేసారి పెడితే షాకుకి గురవుతుంది. ఇలాంటి సంఘటనలు కూడా అడపాదడపా జరుగుతూ ఉంటాయి. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story