Tirupati: చిత్రలేఖనంలో తనదైన ప్రతిభతో దూసుకుపోతున్న యుగేష్

Tirupati: కాలగర్భంలో కలిసిపోతున్న కట్టడాలకు జీవంపోస్తున్న వైనం

Shekhar G
Published on: 2 July 2023 5:15 PM IST
Yugesh Is Coming Forward With His Talent In Painting
X

Tirupati: చిత్రలేఖనంలో తనదైన ప్రతిభతో దూసుకుపోతున్న యుగేష్

Tirupati: కళ్ళ ముందు కనిపించే దృశ్యాలకు కలల ప్రపంచంలోని ఊహలకు ప్రాణం పోసేదే చిత్రకళ. ఎంత సాంకేతికత అందుబాటులో ఉన్నా..చేతితో తీర్చిదిద్దే అపురూపమైన చిత్రాలలో ఉట్టిపడే జీవకళే వేరు. అలాంటి కళకు నేటికి ఎందరో జీవం‌ పోస్తూ కళను ఆదరిస్తూ ఉంటారు. చిత్రలేఖనంలో తిరుపతికి చెందిన యువకుడు తనదైన శైలిలో ప్రతిభను కనబరుస్తున్నాడు. కాలగర్భంలో కలిసిపోతున్న కట్టడాలను తన చిత్ర కళతో సజీవ రూపం ఇస్తున్నాడు.

తిరుపతికి చెందిన‌ యుగేష్ చిత్ర లేఖనంలో చిన్నతనం నుండి ప్రత్యేక ప్రతిభను చాటేవాడు. చిత్రకళలో మేలుకువలు నేర్చుకుని...అదే వృత్తిగా ఎంచుకోవాలని యుగేష్ అనుకున్నాడు. తల్లిదండ్రుల సహకారంతో తన ఇష్టమైన చిత్రలేఖనం సంబంధించి కోర్సులను హైదరాబాదులో‌ అభ్యసించాడు. చిత్రలేఖనంపై పూర్తిగా పట్టు సాధించిన యుగేష్...తిరుపతిలో ఓ చిన్నపాటి ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించాడు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు చిత్రలేఖనం నేర్పిస్తూ చిత్రలేఖనానికి జీవం పోస్తున్నాడు.

చిత్రకారుడు యుగేష్...అందరి చిత్రకారుల్లా కాకుండా విభిన్నంగా ఆలోచించాడు. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలను పరిశీలించి పురాతన ఆలయాలను, శిథిలావస్థలో ఉన్న కట్టడాలను ఇతనే స్వయంగా వెళ్లి ఫోటోలు తీసుకుని...ఆ ఫోటోలతో ఈ చిత్రాలను విభిన్న కోణాలలో చిత్రాలను గీసి భద్రపరుస్తున్నాడు. అలాగే గులకరాళ్ళపై అందమైన బొమ్మలను గీస్తున్నాడు.

కరోనా కష్టకాలంలో ప్రజలకు సహాయం చేసి ఆదుకున్న రతన్‌ టాటా.. సోన్‌సూద్ లాంటి వారి చిత్రాలను గీసి వారికి కృతజ్ఙతలు తెలిపాడు. తాను గీసిన చిత్రం సోను సూద్‌కు చేరిందని...ఆయన కూడా అభినందించారని యుగేష్ చెప్పారు. తిరుపతి జిల్లాలో ఇలాంటి చిత్రలేఖనం సంబంధించి ఎలాంటి స్టూడియో లేదని..తన వంతు సాయంగా కొంతమంది పిల్లలకు తనకు తెలిసిన చిత్రలేఖనాలు నేర్పిస్తున్నట్టు యుగేష్ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story