ఘనంగా సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు

Arun Chilukuri
Published on: 21 Dec 2020 5:03 PM IST
ఘనంగా సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు
X

ఏపీ సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం జగన్‌ జన్మదినం పురస్కరించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం జగన్‌ 48వ పుట్టిన రోజు వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంపీ విజయసాయి రెడ్డి కేక్‌ కట్ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వైస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చడానికి జగన్ కృషి చేస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకుని జగన్ పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు.

సీఎం జగన్ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసిన భూమన తిరుపతిలో సంక్షేమ పథకాలతోనే జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో వైసీపీని గెలిపించి సీఎం జగన్‎కు పుట్టిపరోజు బహుమతిగా అందిస్తామని భూమన వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో జగన్‌ బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. జగన్‌ కష్టాకాలంలో ఉన్నప్పుడు రాని నేతలు ఇప్పుడు పదవుల కోసం వస్తున్నారని విమర్శించారు. జగన్‌పై ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తన వృత్తి సాఫ్ట్‌వేరు. కానీ తాను సాఫ్ట్ కాదన్నారు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌.

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పత్తికొండలో పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులతో కేక్ కట్ చేయించడంతో పాటు.. విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధులకు ఎలాంటి అవసరం ఉన్నా సిద్ధంగా ఉన్నామని యువసేన సభ్యులు చెబుతున్నారు.

సీఎం జగన్ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా పత్తికొండలో ఘనంగా జరిగాయి. వైసీపీ శ్రేణులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాలంటీర్ వ్యవస్థను గౌరవించుకునేలా ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఉపాధి లేక సతమతమవుతున్న తమకు ఉద్యోగాలను కల్పించిన ముఖ్యమంత్రికి వాలంటీర్లు కృతజ్ఞతలు తెలిపారు.

రాజోలు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేశారు. జగన్ పై రాపాక వరప్రసాద్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం అదృష్టమన్నారు. ఇవాళ్టీ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే అత్యంత ఆధునిక టెక్నాలజీ ద్వారా నిర్వహించడం జగన్ తీసుకున్న సాహోసోపేతమైన నిర్ణయమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story