వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
x
Highlights

YSR Rythu Bharosa: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రబీ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు వైఎస్సార్ రైతు భరోసా సొమ్ములను వారి ఖాతాల్లోకి బదిలీ చేశారు.

ఏపీలో రైతులకు మరో విడత వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం ఈరోజు ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు.

జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఏటా రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లకు ముందే రైతు భరోసా సొమ్మును అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రెండవ విడత కింద రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాలకు బదిలీ చేశారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ''వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ రెండో విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500 అందిస్తున్నాం. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో 4వేలు, సంక్రాంతికి రూ.2వేలు సాయం అందిస్తున్నాము. ఇప్పటికే మే నెలలో ముందస్తుగా రూ.2వేలు సాయం చేశాం. ఈరోజు మరో రూ.2వేలు రైతు భరోసా సాయం అందిస్తున్నాం. గిరిజన రైతులకు రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నాము.

ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అర్హులందరికీ మేలు జరిగేలా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం. రాష్ట్రంలో 50శాతం మంది రైతులు 1.25 ఎకరా లోపు ఉన్నవారే. పెట్టుబడి సాయంతో మెరుగైన భద్రత, ఉపాధి లభిస్తుంది. తొలిసారిగా ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఖరీఫ్‌లోనే చెల్లిస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు.. ఖరీఫ్ సీజన్‌లోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ చెల్లించడం ఇదే తొలిసారి. 1.66 లక్షల మంది రైతులకు 135.7 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం'' అని అన్నారు.

పెరిగిన లబ్దిదారులు..

వైఎస్ఆర్ రైతు భరోసా లబ్దిదారులు ఈసారి పెరిగారు. గత సంవత్సరం అక్టోబర్ లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375 మంది కాగా, 2020 మే నెలలో ఖరీఫ్‌ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు ఈ రబీ సీజన్ కు 50,47,383 మంది ఈ కార్యక్రమంలో లబ్ది పొందుతున్నారు. అంటే 1,01,913 మంది కొత్తగా సాయం పొందనున్నారు. 50,47,383 మంది లబ్ధిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం అందనుంది. రబీ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) రైతులకూ రైతు భరోసా అందుతుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2019 అక్టోబర్‌ 15న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించాలనేది ప్రభ్త్వ లక్ష్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories