వైసీపీ ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు కరోనా పాజిటివ్‌

Arun Chilukuri
Published on: 14 Sept 2020 10:31 AM IST
వైసీపీ ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు కరోనా పాజిటివ్‌
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో ఇద్దరు ప్రజా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ తేలింది. చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్‌ బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీకి పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

అరకు వైసీపీ ఎంపీ మాదవికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతుంటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మాధవి పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడే ఉండి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అరకు ఎంపీ మాధవి కోరారు. కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇదివరకే వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్‌గా తేలింది. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా సభలోకి అనుమతి లేదని లోక్‌సభలో స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story