నేడే ఏపీలో వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభం

Arun Chilukuri
Published on: 28 Sept 2020 10:54 AM IST
నేడే ఏపీలో వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభం
X

ఏపీలో వైఎస్సార్‌ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేయనున్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తించనున్నారు. ఇక, పథకాన్ని ఉపయోగించుకోవాలనుకున్న రైతన్నలు తమ పరిధిలోని వాలంటీర్ల ద్వారా.. పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ అప్లై చేసుకునే వీలు ఉంది.

బోరు డ్రిల్లింగ్‌ వేసేముందు రైతు పొలంలో హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారు. అయితే, ఈ పథకంలో లబ్ధి పొందాలనుకునే రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. దీనికి సంబంధించిన సమాచారం అప్టేడ్స్ సదరు రైతుకు ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story