
మాటల మర్మమేంటి.. వైఎస్ ఆత్మ కేవీపీతో బాబు ఏం మాట్లాడారు?
Chandrababu: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇంట ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది.
Chandrababu: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇంట ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. వైఎస్ బతికున్న రోజుల్లో టీడీపీ అధినేతతో తమ వైరంతో రాజకీయాన్ని అట్టుడికించిన వైఎస్ ఆత్మగా పిలవబడే కేవీపీ చంద్రబాబుతో అత్యంత రహస్యంగా ఏదో మాట్లాడారు. వారేం మాట్లాడారు? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఇంతకీ వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఉప్ప-నిప్పుగా ఉండే ఆ నాయకులు మధ్య జరిగిన చర్చేంటి?
నారా చంద్రబాబునాయుడు, కేవీపీ రామచంద్రారావు. ఇద్దరు ఇద్దరే. ఒకరు కింగైతే మరొకరు కింగ్ మేకర్. ప్రజల మధ్య ఉండి రాజకీయాలు ఎలా చేయాలో చంద్రబాబుకు తెలిస్తే తెర వెనుక ఉండి రాజకీయాలు ఎలా నడిపించాలో తెలిసిన చాణక్యుడిగా కేవీపీకి పేరు. అలాంటిది ఇద్దరు నాయకులు చాలా అరుదైన కనిపించే సన్నివేశం ఒకటి చూపించారు. కేవీపీ భుజం మీద చేయి వేసి కనిపించిన చంద్రబాబు ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. కేవీపీ ఎలా ఉన్నావని బాబు అడిగారా బాబు గారూ బాగున్నారా? అని కేవీపీ అడిగారా? ఇదే హాట్ టాపిక్గా తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న చర్చ.
రాజకీయ కురువృద్ధుడు రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించే సమయంలో కనిపించిన ఆసక్తికరమైన దృశ్యమిది. సరే ఒక రాజకీయ దిగ్గజానికి నివాళులర్పించేటప్పుడు రాజకీయాలు ఉండొద్దు. కనిపించొద్దు. కానీ ఈ సీన్ లెక్కే వేరేగా ఉందంటున్నారు విశ్లేషకులు. వైఎస్ బతికున్న రోజుల్లో ఆయన ఆత్మబంధువుగా, షాడో సీఎంగా చెలామణి అయిన కేవీవీ తమ ఆగర్భ రాజకీయ శత్రువుగా భావించే చంద్రబాబు మధ్య అదే వైరం కంటిన్యూ అయింది. వైఎస్ చనిపోయి దాదాపు పన్నెండేళ్లవుతున్నా వీళ్లిద్దరూ ఏనాడూ కలసిందీ లేదు. మాట్లాడకున్నదీ లేదు.
మరి కేవీపీ, బాబు మధ్య మాటల మర్మమేంటి? రాజకీయాల్లో హాటాట్గా నడుస్తున్న చర్చ ఇదే. వైఎస్సార్, చంద్రబాబు మధ్య రాజకీయాలు అప్పట్లో ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించేవి. అయితే ఇదంతా అసెంబ్లీ వరకే పరిమితమే అయినా ఆ వైరం వ్యక్తిగత దూషణల వైపు మళ్లడంతో పొలిటిక్స్ హీటెక్కాయి. వైఎస్, చంద్రబాబుతో ఎంత వైరం పెంచుకున్నారో చంద్రబాబు కూడా వైఎస్ అంటే అంతే ద్వేషం పెంచుకున్నారని చెప్పుకుంటారు రెండు పార్టీల నేతలు. అలాంటిది వైఎస్ ఆత్మబంధువుగా పేరొందిన కేవీపీ కూడా చంద్రబాబుతో అంతే స్థాయిలో చెలరేగిపోయేవారు. సందర్భం వస్తే తెరచాటుగా రెచ్చిపోయేవారు.
హెల్తీ పొలిటిక్స్ ప్లే చేసిన వైఎస్, చంద్రబాబు, రాజకీయంగా ఘాటు విమర్శలు చేసుకున్నా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత హాయిగా నవ్వుకుంటూ పలకరించుకునే వారు. పరస్పరం జోకులేసుకునే వారు. వైఎస్ తనకు మంచి మిత్రుడని చంద్రబాబు మొన్నీ మద్య అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అలాంటి ఓ సమయంలోనే వైఎస్కు సూట్కేసులు మోసే వ్యక్తి అంటూ కేవీపీని టార్గెట్ చేశారు అప్పట్లో టీడీపీ నేతలు. కానీ రోశయ్య ఇంట కనిపించిన ఓ సీన్, చంద్రబాబు, కేవీపీ కలయిక అందరి దృష్టిని ఆకర్షించింది. కేవీపీ భుజంపై ఆత్మీయంగా చేయి వేసి, ఐదు నిమిషాల పాటు ఇద్దరూ మాటల్లో పడిపోవడం అక్కడున్న వాళ్లనే కాదు ఆ సీన్ చూసిన వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
రోశయ్యకు నివాళి అర్పించడానికి చంద్రబాబు వాళ్లింటికి వెళ్లారు. రోశయ్య భార్య శివలక్ష్మితో పాటు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ఓదార్చారు. అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కేవీపీ బాబూ బాగున్నారా అంటూ నమస్కరిస్తూ ఆత్మీయంగా పలకరించారట. చంద్రబాబు కూడా అంతే సంస్కారంతో ప్రతి నమస్కారం చేస్తూ బాగున్నానని సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగి ఉంటే ఎలాంటి చర్చే లేదు. కానీ, కేవీపీ భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నారు. ఇద్దరూ ఐదు నిమిషాలు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడాన్ని రాజకీయ వర్గాల్లో విశేషంగా చెప్పుకుంటున్నారు. బాబు, కేవీపీ ఏం మాట్లాడుకుని ఉంటారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
అదే ఏం మాట్లాడుకొని ఉంటారు మరి? ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంతెందుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు జగన్ అండ్ టీమ్ను భరించడం తన వల్ల కాదంటూ బోరుమన్నారు. మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చారు. ఇది సింపథి క్రియేట్ చేసిందో సీన్ క్రియేట్ చేసిందో ఏమో కానీ, ఈ విషయం గురించి ఏమైనా వీళ్లిద్దరూ మాట్లాడుకొని ఉంటారా? అన్న చర్చ నడుస్తోంది. ఏమైనా చంద్రబాబు, కేవీపీ కలయికపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ లోగుట్టు మాత్రం ఆ పెరుమాళ్లకే ఎరుక అంటున్నారు విశ్లేషకులు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire