విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణపై నిర్వాసిత గ్రామాల ప్రజల ఆవేదన

Vizag Steel Plant Staff for Agitation Against Move to Privatize Company
x

స్టీల్ ప్లాంట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తే బతుకులు బాగుపడతాయని భావించి ఎంతోమంది తమ జీవనాధారమైన భూములను ఇచ్చారు. కర్మాగారం వస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని...

విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తే బతుకులు బాగుపడతాయని భావించి ఎంతోమంది తమ జీవనాధారమైన భూములను ఇచ్చారు. కర్మాగారం వస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అప్పట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో సభలు పెట్టి చెప్పడంతో...నిజమని నమ్మి భూములను అప్పగించారు. ప్లాంట్‌ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. భూ సేకరణ సమయంలో ఇచ్చిన హామీల్లో చాలావరకు నెరవేరనేలేదు. భవిష్యత్తులో అయినా నెరవేరతాయేమో అన్న ఆశతో వారంతా ఇప్పటివరకూ ఎదురుచూశారు. ఈలోగానే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ప్రైవేటీకరణ చేయాలని లేకుంటే తమ చావే గతి నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 1971లో 15 వేల ఎకరాల భూమిని సేకరించింది కేంద్ర ప్రభుత్వం. ఎకరాకు రూ.1,200 చొప్పున నిర్వాసితులకు చెల్లించారు. పరిహారం సరిపోదని నిర్వాసితులు ఆందోళన చేయడంతో 1973లో రూ.3,000 చొప్పున ఇచ్చారు. ప్లాంట్‌ కు ఇంకా భూమి అవసరమని ఆ తర్వాత మరో 11 వేల ఎకరాలను సేకరించారు. ఈ భూములకు ఎకరాకు రూ.26 వేల వరకూ పరిహారం చెల్లించారు. నెలిముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, గంగవరం, దిబ్బపాలెం, కణితి, అప్పికొండ, వడ్లపూడి, కొండయ్యవలస పంచాయతీల పరిధిలోని 64 గ్రామాల్లో సుమారు 26 వేల ఎకరాలు సేకరించారు. అప్పట్లో 16 వేల మందిని నిర్వాసితులుగా గుర్తించారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, ఇళ్లు కోల్పోయిన వారికి 107 గజాల స్థలం, నిర్వాసితులుగా గుర్తించే ఆర్‌-కార్డు ఇచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తమ విలువైన భూములు ఇచ్చిన నిర్వాసితులకు నేటికీ పూర్తిగా న్యాయం జరగలేదు. దశాబ్దాలు తరబడి నిరీక్షిస్తున్న నిర్వాసితుల కుటుంబాల భవిష్యత్ కు భరోసా లేకుండా పోయింది. భూములిచ్చి ఉద్యోగం కోసం ఎదురుచూసీ వయస్సు అయిపోయినవారు ఎందరో వున్నారు. తమకు కాకపోయిన తమ పిల్లలకు అయినా ఉపాధి లేదా ఉద్యోగం వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో పిడుగులాంటి వార్త వినిపించింది. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఈ పరిస్థితుల్లో తమ గోడు వినేది ఎవ్వరని? తమని ఆదుకునే నాధుడెవ్వరని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే చావే గతి అని హెచ్చరిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 26 వేల ఎకరాల భూములు తీసుకుంది. ఈ భూములకు సంబంధించిన అనేక వివాదాల తర్వాత ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అధీనంలో దాదాపు 19వేలకుపైగా ఎకరాల భూమి వుంది. భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇంటి స్థలం, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ కార్డ్ లు ఇవ్వటం జరిగింది. దశాబ్దాలు గడుస్తున్న నిర్వాసితులలో సగం మందికి మాత్రమే ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించారు.

తమకు న్యాయం చేయాలని మారిన ప్రతీ ప్రభుత్వ పెద్దలు వద్దకు వెళ్ళి నిర్వాసితులు తమ గోడు వెళ్ళబోసుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తెలిసినప్పటి నుంచి నిర్వాసితులు నిద్రాహారాలు మాని కన్పించిన ప్రతీ నాయకులను కలిసి తమకు న్యాయం చేయమని వేడుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులను కలిసి వినతి పత్రాలు అందిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులను అక్కడి నుంచి తరలించి వారికీ రెహెబిలిటేషన్ నెంబర్ పేరుతొ ఒక నెంబర్ ను కేటాయించారు.దీని ఆర్ నెంబర్ అంటున్నారు.ఈ నెంబర్ కేటాయించిన ప్రతి వ్యక్తికి ఇల్లు నిర్మించుకోవడానికి సుమారు 107 గజాలు స్థలం తో పాటు ఒక ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హామీ ఇచ్చారు.అయితే ఇప్పటికి సగం మందికి మాత్రమే ఈ హామీ నెరవేరింది ఇంకా సగం మంది ప్లాంట్ లో ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఆనాడు పొలాలు, భూములతోపాటు ఆ భూములకు అనుకుని ఉన్న కొండలతో కలిపి సుమారు 26 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది.ప్లాంట్‌, టౌన్‌షిప్‌ నిర్మాణం చేయగా ఇంకా సుమారు 8,500 ఎకరాల భూమి స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉందని ప్లాంట్ నిర్వాసితులు అంటున్నారు.ప్లాంట్‌ నిర్మాణం సగం మందికి మాత్రమే ప్లాంట్‌లో ఉద్యోగాలు లభించాయి.ఇంకా చాలా మంది ఆర్ కార్డులు పట్టుకుని ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారు.అప్పట్లో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని స్టీల్ ప్లాంట్ కోసం మా పెద్దలు భూములు ఇచ్చారు అని నిర్వాసితులు అంటున్నారు. ప్రైవేటీకరణ చేస్తే తమ బతుకులు ఏం కావాలి అని వాపోతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పటిలో 64 గ్రామాల నుంచి 26 వేల ఎకరాలను సేకరించించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాఇంకా మాకు ఉద్యోగాలు రాలేదు అని నిర్వాసితులు వాపోతున్నారు. ప్లాంట్ వారిచ్చిన ఆర్ కార్డులు పట్టుకుని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం అని అయిన తమగోడు ఎవరు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయం లో రాజకీయ నాయకులు వచ్చి నిర్వాసితుల సమస్యలు తీర్చుతాం అంటున్నారు తప్ప ఇప్పటివరకు ఆదిశగా ఎవరు పరిస్కారం చూపడం లేదని అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రెవేటు చేతులలోకి వెళ్తే తమ భవిష్యత్ ఏంటి అని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. మీ భవిష్యత్ బాగుటుంది, ఉద్యోగాలు కల్పిస్తామని అనడం తో ఆలోచించకుండా భూములు ఇచ్చామని వారు అంటున్నారు. భూములు ఇచ్చిన వారిలో సగం మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి అని ఇంకా సగం మందికి ఉద్యోగాలు కల్పించవలసి ఉందని అంటున్నారు. ఇప్పుడు ప్లాంట్ ను ప్రెవేటు పరం చేస్తే తమకు ఏం చేయాలో తెలియడం లేదు అని నిర్వాసితులు అవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ ను ప్రారంబించే సమయం లో ప్రధాన మంత్రి భూములు ఇచ్చిన ప్రతిఒక్కరికి ప్లాంట్ లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో లాభాలలో నడిచిన ప్లాంట్ గత కొన్ని సంవత్సరాలు నుంచి సొంత గనులు లేకపోవడం వలన నష్టాలలో నడుస్తుంది అని ఇప్పటికైనా ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయిస్తే లాభాలలో నడుస్తుంది అని వారు అభిప్రాయపడుతున్నారు.కేవలం కేంద్ర ప్రభుత్వం స్వార్ధ ప్రయోజనాలు కోసం ప్లాంట్ ను ప్రెవేటు పరం చేతున్నారని వారు అంటున్నారు.ఆర్ కార్డులు ఉన్న ఇప్పటి వరకు ఉపాధి లేదు అని ఆ కార్డు ఉన్న ఇప్పటి వరకు ప్రయోజనం లేకుండా పోయింది అని అంటున్నారు.ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారింది అని వారు అవేధన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం చొరవ తీసుకోని తమకు భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలకు వినతి పత్రం ఇస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తామని జనసేన నాయకులు అంటున్నారు.

నిర్వాసితుల గుర్తించే ఆర్ కార్డు ప్రయోజనం లేకుండాపోయింది. ఉపాధి హామీ నీటి మూటగా మారింది. ఉద్యోగం దొరుకుతుందని ఆశపడ్డవారికి ఉద్యోగం రాకముందే వయసు అయిపోయింది.సగం మంది ఇంకా ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన నిర్వాసితులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయండి లేదా హామీలు నెరవేర్చండి అని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు.

ఆర్ కార్డు లు ఉంది కూడా ప్లాంట్ లో ఉపాధి లేకపోవడం తో కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. నిర్వాసిత గ్రామాలలో కొంత మంది కూలీపనికి వెళ్లలేని స్థితి లో ఉండడంతో అటువంటి కుటుంబ పోషణ భారంగా మారింది..భూములు ఇచ్చి 40 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి తమని ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్లాంట్ పై గంపెడు ఆశలతో ఉన్న తమకు ప్రెవేటు పరం చేస్తాను అనడం తీవ్ర నిరాశను కలుగజేస్తుంది అని అంటున్నారు.ప్లాంట్ ను ప్రేవేటీకరణ చేస్తే సహించేది లేదని ప్లాంట్ ను పరిరక్షించడానికి ప్రాణత్యాగాలకైనా వెనకాడబోమని నిర్వాసితులు అంటున్నారు.ప్లాంట్ ను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరు అని ఇప్పటికి ప్లాంట్ పై తమకు హక్కులు ఉన్నాయని వారు అంటున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రజాప్రతినిధులు ఇళ్లు ముట్టడిస్తామని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆవేదన ఆక్రాందన స్టీల్ ప్లాంట్ వస్తే తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా వుంటుందని విలువైన తమ భూములను ప్లాంట్ కు ధారాదత్తం చేస్తే తమని రోడ్డున పడేశారని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories