బాబు ఏడుపు ఎపిసోడ్‌కు వంశీయే కారణమా.. సీరియస్ పోస్టుమార్టమ్ చేస్తున్న వైసీపీ

Vallabhaneni Vamsi Behind Chandrababus Crying Scene
x

బాబు ఏడుపు ఎపిసోడ్‌కు వంశీయే కారణమా.. సీరియస్ పోస్టుమార్టమ్ చేస్తున్న వైసీపీ

Highlights

Chandrababu: చంద్రబాబు కంటతడికి వల్లభనేని వంశీయే కారణమా?

Chandrababu: చంద్రబాబు కంటతడికి వల్లభనేని వంశీయే కారణమా? అదే పనిగా పదే పదే అవే మాటలు అనడం బాబుకు కన్నీళ్లు తెప్పించాయా? వంశీ ఆ ఎపిసోడ్‌ను ఎక్కడి నుంచి స్టార్ట్‌ చేశారు? ఎందుకు స్టార్ట్‌ చేశారు? సెంటిమెంట్‌ సీన్‌ అనూహ్యంగా రక్తి కట్టించడంలో వంశీ పాత్ర ఎంత? ఇంటర్నల్‌ రివ్యూల్లో వంశీ రోల్‌ మీద ఇటు వైసీపీ, అటు టీడీపీలో జరుగుతున్న చర్చేంటి? ఆ రచ్చేంటి?

ఏపీ రాజకీయాల్లో వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ హాట్‌టాపిక్‌గానే ఉంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టుకున్న ఘటన నుంచి వరదలు ఆపై మూడు రాజధానులు, మండలి రద్దు బిల్లులపై ఏపీ సర్కార్ వెనక్కి తగ్గడం వంటి ఘటనలు వరసగా చోటుచేసుకున్నాయి. అయితే మిగతా వాటి గురించి కాసేపు పక్కనబెడితే చంద్రబాబు ఎపిసోడ్ మాత్రం అధికార వైసీపీకి కొంత ఇబ్బందిగానే మారిందట. బాబును పొలిటికల్ సెటిల్మెంట్ వైపు తీసుకుపోదామనుకుంటే మధ్యలో సెంటిమెంట్ సీన్‌ ఇలా పండిపోయిందేమిటని ఆ పార్టీ ఆలోచిస్తోందట. అసలు ఇదంతా ఎక్కడ, ఎలా మొదలైందన్న చర్చ జరుగుతుందట. ఎలా మొదలైందనే దానిపై తాడేపల్లిలో అంతర్గత సమీక్షలు సైతం తెగ జరుగుతున్నాయట.

వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు తమకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని కల్పిస్తుండటంతో వైసీపీ హైకమాండ్‌ సీరియస్ పోస్టుమార్టమ్ మొదలు పెట్టిందట. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తమను గట్టెక్కిస్తాయని నమ్ముతున్న తరుణంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు తమకు భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టిస్తాయని వైసీపీ ముఖ్యనేతలు భావిస్తున్నారట. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎపిసోడ్‌లో తప్పెవరిది తప్పిదం ఎలా జరిగింది.? దీని వల్ల ఏమైనా డ్యామేజ్ జరుగుతోందా..? జనం ఈ తాజా ఘటనలపై ఏమనుకుంటున్నారు...? ఇలా వివిధ రకాలుగా ఇంటలిజెన్స్ వర్గాలతో సమాచారం తెప్పించుకుంటోందట.

టోటల్‌ ఈ ఎపిసోడ్‌లో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అంబటి రాంబాబులు కనిపిస్తే మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయట. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీపై గరం గరం చర్చ నడుస్తోందట. టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న సమయంలో అన్నం తినేవారెవరూ వైసీపీలో చేరడంటూ హాట్ కామెంట్స్ చేసిన వంశీ, వైసీపీకి మద్దతుగా ఇప్పుడు కొనసాగుతున్నారు. అలాగే, తాజాగా చంద్రబాబుపై కొంతమంది వైసీపీ నేతల హాట్ కామెంట్స్‌కు మూల కారణం వంశీయేనన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. నెల రోజుల క్రితం ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లంతా గుర్రుమంటున్నారట. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే వంశీతో పాటు ఇతర నేతలపైనా విరుచుకుపడుతున్న తరుణంలో పోలీసు శాఖ వీరందరికీ అదనపు భద్రత కల్పించటం విశేషం.

సాధారణంగా ఎన్టీఆర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఇప్పుడు సడెన్‌గా వారిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. గతంలో టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై వ్యాఖ్యలు చేసిన సందర్భంలో వంశీ తనదైన శైలిలో వివాదాస్పద కామెంట్లు చేశారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పుట్టుక ఎలాంటిదో తెలుసా అంటూ దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి ప్రస్తావన తీసుకువచ్చి వివాదానికి ఆజ్యం పోశారన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు, మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్‌కు ప్రతి సవాల్‌గా స్పందించిన వంశీ, జయప్రదంగా సైకిల్ గుర్తును చంద్రబాబు అక్రమ మార్గంలో సాధించుకున్నారంటూ విమర్శలకు మరింత పదునుపెట్టారు. దీంతో ఇవే అంశాలను వైసీపీ నేతలు ట్రోల్ చేశారన్నది టీడీపీ ఆరోపణ. అయితే తాము భువనేశ్వరి పేరును ఏ మాత్రం ప్రస్తావించకున్నప్పటికీ, కుప్పం ఓటమి నుంచి డైవర్ట్ చేయటానికే చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్‌ను తెరపైకి తెచ్చారంటూ వైసీపీ నేతలు తమ ఎదురుదాడుల్ని ముమ్మరం చేయాల్సి వచ్చిందట.

మొత్తమ్మీద టీడీపీ శిబిరానికి వల్లభనేని వంశీ ప్రధాన టార్గెట్‌గా మారారట. మిగతా వైసీపీ నేతలపై ఓ కన్నేసి ఉంచుతూనే వంశీని మాత్రం రాజకీయంగా వదిలేదేలే అని డిసైడయిందట. పాలిటిక్స్‌లో విమర్శలు సహజమేననీ, అయితే వంశీ దాని పరిధికి మించి వ్యవహరించారని ఫిక్సయిన తమ్ముళ్లు వంశీపై పోటీకి ఎవరైతే సరిపోతారోనని ఇప్పటి నుంచే ఆరా తీస్తోందట. మరి బాబు అండ్ కో వ్యూహాలకు వంశీ స్పందన ఎలా ఉండబోతుందో ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు విషయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీలు తమ ధోరణిని అలాగే కంటిన్యూ చేస్తున్న తరుణంలో భవిష్యత్తులో ఇంకెలాంటి ఆసక్తికరమైన పరిణామాలు ఏపీ రాజకీయ తెరపై కనిపిస్తాయో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories