తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీవారి ఆలయ సంప్రదాయాలకు తూట్లు పొడిచారు. విశాఖ శారదా పీఠాధిపతి...
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీవారి ఆలయ సంప్రదాయాలకు తూట్లు పొడిచారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామికి అలిపిరి గేటు దగ్గర వేద మంత్రాలతో టీటీడీ వేద పారాయణ అర్చకుల చేత స్వాగతం పలికారు. ఇక, అలిపిరి గేటు దగ్గరే స్వరూపానందేంద్రను కలుసుకున్న మంత్రి బుగ్గన, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిలు శాలువాతో సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు.
రామానుజాచార్యుల పీఠాల మఠాధిపతులు తిరుమలకు వస్తే, శ్రీవారి ఆలయం ముందు వేద మంత్రాలతో ఇఫ్తికఫాల్ స్వాగతం పలకడం టీటీడీలో ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే, అనాదిగా వస్తోన్న సంప్రదాయాలకు విరుద్ధంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామికి అలిపిరి గేటు దగ్గర వేద మంత్రాలతో టీటీడీ వేద పారాయణ అర్చకుల చేత స్వాగతం పలకడం వివాదాస్పదమైంది. దాంతో, ఎవరి మెప్పు కోసం టీటీడీ అధికారులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారని శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ ప్రశ్నిస్తున్నారు.
మఠాధిపతులు, పీఠాధిపతులను గౌరవించడం హిందూ సంప్రదాయమైనప్పటికీ, టీటీడీ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించడం అపచారమంటున్నారు. టీటీడీ అధికారులు శ్రీవారికి సేవ చేయాలే గానీ, ఇలా మఠాధిపతులు, పీఠాధిపతులకు సేవకులుగా మారకూడదని అంటున్నారు. సంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయం ముందు స్వాగతం పలికితే తమకు అభ్యంతరం లేదు కానీ ఇలా అలిపిరి గేటు దగ్గరే, విమానాశ్రయానికి వెళ్లిమరీ రాజకీయ పార్టీ కార్యకర్తల్లా టీటీడీ అధికారులు వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని మండిపడుతున్నారు.
టీటీడీ అధికారుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి అంటున్నారు. ధర్మానికి విరుద్ధంగా ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ అధికారులు తమ పరిపతిని పెంచుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు.
టీటీడీ అధికారులు తలిస్తే ఏమైనా చేయగలరు. అందుకు అలిపిరి గేటు దగ్గర స్వరూపానందేంద్రస్వామికి స్వాగత సత్కారాలే ఒక రుజువు. ఇక టీటీడీ టెంపుల్ బైలాస్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి దేన్నీ బయటికి తీసుకుని రాకూడదు. అలాంటిది పవిత్ర ఆకులతో తయారుచేసిన ధనుర్మాస చిలకను తిరుమల ఆలయం నుంచి అలిపిరికి తీసుకొచ్చి స్వరూపానందేంద్రకు ఇవ్వడం ఆలయ నిబంధనలకు విరుద్ధమంటున్నారు. ప్రతిరోజు గోదాదేవి జ్ఞాపకార్థంగా అలంకరించే ఈ ధనుర్మాస చిలకను ఏవిధంగా ఆలయం నుంచి బయటికి తీసుకొచ్చి స్వరూపానందేంద్రకు ఇస్తారని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు.
టీటీడీ ఆలయ నిబంధనల ప్రకారం శ్రీవారికి అలంకరించిన పూలమాలలను సైతం బయటికి ఇవ్వకూడదు. అయితే, ధనుర్మాసం సందర్భంగా పవిత్ర ఆకుతో తయారుచేసిన ఒక బంగారు చిలుకను శ్రీవారి శంఖం దగ్గర ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, శ్రీవారి సన్నిధిని దాటుకుని గర్భాలయంలో ఉన్న చిలుకను అలిపిరి వరకు తీసుకొచ్చేందుకు ఎవరు అనుమతించారనేది తెలియాల్సి ఉంది. టీటీడీ ఈవో అనుమతించారా? లేక అధికారులే ఈ పని చేశారో చెప్పాలని శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ ప్రశ్నిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire