Lunar Eclipse 2025: చంద్రగ్రహణం తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు

Temples: గ్రహణం అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న మధ్యాహ్నం నుంచే ఆలయాలను మూసివేసారు.

Arun Chilukuri
Published on: 8 Sept 2025 11:10 AM IST
Lunar Eclipse 2025: చంద్రగ్రహణం తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు
X

Lunar Eclipse 2025: చంద్రగ్రహణం తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు

Temples: గ్రహణం అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న మధ్యాహ్నం నుంచే ఆలయాలను మూసివేసారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి.. శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాత సేవ, ఆరాధన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం ఈ తెల్లవారుజామున తెరుచుకుంది. చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో నిన్న 10 గంటలపాటు ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణ మోక్షానంతరం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు శుద్ధిచేసి, సంప్రోక్షణ, చేసిన తర్వాత ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు.

చంద్రగ్రహణం అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేకువజామున గ్రహణ కాలం ముగిసిన వెంటనే శ్రీవారి ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయం శుద్ధి చేసి , పుణ్యాహచనం నిర్వహించారు. శాస్త్రబద్ధంగా సుప్రభాతం, తోమాల, అర్చన మొదలుకొని నిత్య కైంకర్యాలు ప్రారంభించారు. ఉదయం నాలుగు గంటల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. గత రాత్రి నుంచే వేచి ఉన్న భక్తులు, దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్ర ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం తర్వాత శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి.. ఉదయం 5 గంటలకు ద్వారాలు తెరిచారు అర్చకులు. శ్రీ స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతి పూజ నిర్వహించి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 4 వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తిరిగి రాత్రి 9 గంటలకు రెండో విడత స్పర్శ దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story