విశాఖ ఉక్కు బిడ్డింగ్​లో తెలంగాణ.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Telangana Government Interested In Bidding In Vizag Steel
x

విశాఖ ఉక్కు బిడ్డింగ్​లో తెలంగాణ.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Highlights

* ప్రైవేటీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా నిర్ణయం

Vizag: ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు ముడిసరకుల కోసం నిధులు ఇచ్చి.. నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ ప్రతిపాదనల బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది. ఇందులో సింగరేణి తరఫున లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ తరపున లే.. నీటిపారుదల శాఖ తరుపున పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. EOI ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని కేసీఆర్‌ ఆదేశించారు. త్వరలో అధికారుల బృందం విశాఖకు వెళ్లనుంది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం సేకరించాలనుకుంటున్న నిధులెన్ని, తద్వారా తిరిగిచ్చే ఉత్పత్తులు లేదా నిధులను తిరిగిచెల్లించే విధానాలు, ఇతర నిబంధనలు, షరతులను కూలంకషంగా అధ్యయనం చేయనుంది.

విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన ముడిసరకుల కోసం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌ గత నెల 27న ప్రైవేట్‌, ఇతర స్టీల్‌ అనుబంధ రంగాల కంపెనీలు లేదా సంస్థల నుంచి EOI టెండర్లను ఆహ్వానించింది. ఇది బీజేపీ అనుకూల కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెబుతూ అంతిమంగా స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే ప్రక్రియలో తొలి అడుగని, ఈవోఐ రూపంలో ప్రైవేట్‌ కంపెనీలను చొప్పించే కుట్రకు తెరలేపిందంటూ కేంద్రానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.

కేటీఆర్ లేఖపై కర్మాగారం ఉద్యోగ సంఘాలు, కార్మిక వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలవగా.. కర్మాగారం ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న పరిష్కార మార్గాలను వారు సూచించారు. వాటిని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి చంద్రశేఖర్‌ తీసుకెళ్లారు. దీనిపై ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో నిన్న సీఎం కేసీఆర్ చర్చించారు. అధికారుల నుంచి కావాల్సిన సమాచారం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వపరంగా ఈవోఐలో పాల్గొనాలని నిర్ణయించారు.

ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై తమ పార్టీ వ్యతిరేకతను బలంగా చాటడమే కాకుండా, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ప్రభుత్వపరంగా వ్యవహరించాల్సిన తీరుపై బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయీల హయాంలో కర్మాగారానికి మూలధన నిధులు అందించారని.. ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొనసాగుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన ఉక్కును నేరుగా కొనుగోలు చేయవచ్చని, తద్వారా వ్యయం తగ్గుతుందనీ భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్న సింగరేణి సంస్థ ఈవోఐ ప్రక్రియలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, నీటిపారుదల శాఖలను సైతం సన్నద్ధం చేస్తున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారంలో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడిఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు.. యాజమాన్యం మార్చి 27న తెలిపింది. బొగ్గు, నేల బొగ్గు, ఇనుప ఖనిజం వంటి ముడి పదార్థాలను సరఫరా చేయడంతో పాటు పరస్పర అంగీకారంతో నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదా ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసేవిగా ఉండాలని ఈవోఐలో పేర్కొంది. ఈ నెల 15న సాయంత్రం మూడు గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories