Srisailam: శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు

Srisailam: ఏర్పాట్లు చేసిన దేవస్థాన యంత్రాంగం

Shekhar G
Published on: 14 Aug 2023 9:42 AM IST
Sravana Masam Special Poojas In Srisailam
X

Srisailam: శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు 

Srisailam: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహా పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మహా పుణ్యక్షేత్రానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. శ్రావణమాస సందర్భంగా క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు... అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు, నోములు చేస్తారు...

శ్రావణమాసం ఆగస్టు 17న ప్రారంభమై సెప్టెంబర్ 15న ముగుస్తుంది. ఈ నెలలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారాలను ఎంతో పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తుంటారు.. ఈ విధంగానే శ్రావణమాసంలో పెద్ద ఎత్తున పరమ శివుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. లక్ష్మీదేవికి ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. పార్వతీదేవికి పసుపు కుంకుమలతో నోము నోయటం వల్ల తమ పసుపు కుంకుమలు పది కాలాలపాటు చల్లగా ఉంటాయని వివాహితులు ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం మొత్తం భక్తులు ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలలో నిమగ్నమై పూర్తిగా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు.

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో నెలరోజులపాటు శ్రావణమాస ఉత్సవాలు జరుగుతాయి. ఈనెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు ఇక్కడ శ్రావణమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. భక్తులు వేకువజామునే పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలతో స్వామి అమ్మవార్లలను దర్శించుకుంటారు. శ్రావణమాసంలో శ్రీశైలానికి వచ్చే భక్తులకు దేవస్థాన యంత్రాంగం, పాలకమండలి కార్యనిర్వాహణాధికారి ఎస్.లవన్న ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుణ్యస్నానాలకు పాతాళ గంగ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story