Ayyanna Patrudu: రాజకీయాల్లోకి యువత రావాలి.. అచ్చెన్న, లోకేష్ బరువుపై స్పీకర్ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు!

Ayyanna Patrudu: అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాటామంతి. విద్యార్థుల అసెంబ్లీ సందర్శనపై హర్షం. మంత్రి లోకేష్, అచ్చెన్నాయుడు బరువు తగ్గడంపై అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు. పూర్తి వివరాలు ఇక్కడ.
Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. అసెంబ్లీ సందర్శనకు వస్తున్న విద్యార్థుల స్పందనతో పాటు, గత రాత్రి మంత్రి లోకేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంపై ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించడంపై స్పీకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 700 మందికి పైగా విద్యార్థులు అసెంబ్లీని వీక్షించారని, కేవలం రెండు రోజుల్లోనే 200 పాఠశాలల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. "విద్యార్థులు ఇక్కడికి వచ్చి తాము కూడా ఎమ్మెల్యేలు అవుతామని చెబుతుంటే చాలా తృప్తిగా ఉంది. నేటితరం కేవలం డాక్టర్లు, ఇంజినీర్లు మాత్రమే కాకుండా రాజకీయాల వైపు కూడా ఆలోచించాలి" అని ఆయన ఆకాంక్షించారు. పాఠశాలల్లో మాక్ అసెంబ్లీల నిర్వహణ పెరగడం శుభపరిణామమని పేర్కొన్నారు.
లోకేష్, అచ్చెన్న డైట్ పై స్పీకర్ సెటైర్లు
గత రాత్రి మంత్రి నారా లోకేష్ నివాసంలో జరిగిన భేటీ గురించి చెబుతూ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. అందరం ఒకే కుటుంబ సభ్యుల్లా సరదాగా గడిపామని, అయితే పెళ్లి రోజు కావడంతో మంత్రి విజయ్ ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారని చెప్పారు. లోకేష్ ఇప్పటికే బాగా బరువు తగ్గాడని, ఇకపై అంతకంటే తగ్గవద్దని సూచించానన్నారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా విపరీతంగా బరువు తగ్గడం అంత మంచిది కాదని తాను హెచ్చరించినట్లు స్పీకర్ చమత్కరించారు. "చంద్రబాబు గారు పాటించే డైట్ పాటిస్తే ఎవరైనా ఇట్టే బరువు తగ్గిపోతారు" అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



