Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్.. వరుస మరణాలు.. భయందోళనలో ప్రజలు

Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్.. వరుస మరణాలు.. భయందోళనలో ప్రజలు
Scrub Typhus: స్క్రబ్ టైఫస్ ఏపీ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయిన నిర్లక్ష్యంతో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
Scrub Typhus: స్క్రబ్ టైఫస్ ఏపీ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయిన నిర్లక్ష్యంతో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. శరీరంపై ఏదైనా కీటకం కుడితే ఏమైతదిలే అనుకుంటే నిండు ప్రాణం గాలిలో కలిసిపోతుంది. దోమ, చీమలు లాంటి ఏదైనా కీటకం కుడితే, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని, వైద్యులను సంప్రదించకుండా మాత్రలు వాడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు గత కొన్నేళ్లుగా వెలుగుచూస్తున్నా.. ప్రస్తుతం వరుస మరణాలు ప్రజలను భయందోళనకు గురి చేస్తుంది. నల్లి వంటి ఈ చిన్న కీటకం కరవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉందని, స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు వాటికి అనుకూల వాతావరణం కావడంతో వ్యాధి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.
గత నెలలో విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి స్క్రబ్ టైఫస్ లక్షణాలతో తీవ్ర శ్వాసకోశ సమస్యలతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పల్నాడు జిల్లాలో జ్యోతి, నాగమ్మ, బాపట్ల జిల్లాకు చెందిన మస్తాన్బీ, నెల్లూరు జిల్లాలో సంతోషి ఇలా ఐదు మంది స్ర్కబ్ టైఫస్ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డారు. అధికంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని వైద్యులు గుర్తించారు.
నల్లిని పోలిన చిగ్గర్ మైట్ కీటకం కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి మనుషులకు వస్తుందని డాక్టర్స్ తెలిపారు. వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే అంటువ్యాధి కాదని. పొలాలు. తోటలు, నదీ తీరాలు, ఇసుక మేటలు, పశువుల పాకలు, జంతువుల శరీర భాగాలలో ఈ కీటకాలు నివాసం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ కీటకం కాటు వేస్తే నల్లని మచ్చలా ఏర్పడి, దద్దుర్లు, జీర్ణ, శ్వాసకోశ సమస్యలు.. నీరసం, జ్వరం, వణుకు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వస్తాయని, సకాలంలో వైద్యం అందకపోతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెదడు, కిడ్నీ, శరీరంలోని ఇతర భాగాల పనితీరుపై ప్రభావం చూపి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం వైద్యులు తెలిపారు.
పరిసరాలు, తోటలు, గడ్డివాములు. ప్రతి రోజు శుభ్రంగా ఉంచుకోవాలని. రాత్రి పూట ఈ కీటకాల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబ్బటి, ఇంట్లో ఎలుకలు, కీటకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వాడాలి. జాగ్రత్తలు తీసుకోకుండా బయట నిద్రించడం, నేలపై నిద్రించడం మంచిది కదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉంది కాబ్బటి తల్లిదండ్రులు పిల్లల పట్ల అధిక శ్రద్ద తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. తాజా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించి సరైన వైద్యంతో కట్టడి చేయవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



