Bapatla: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు

Bapatla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది.

Arun Chilukuri
Published on: 9 Jan 2026 12:41 PM IST
Bapatla: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు
X

Bapatla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

శుక్రవారం ఉదయం బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బాపట్ల నుండి రేపల్లే వైపు బయలుదేరింది. ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. డ్రైవర్ బ్రేకులు వేయడానికి ప్రయత్నించినప్పటికీ, అవి పనిచేయకపోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకుపోయింది.

బస్సు చెరువులోకి వెళ్లగానే లోపల ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులందరినీ బస్సు అద్దాలు, తలుపుల ద్వారా క్షేమంగా బయటకు తీశారు. స్థానికుల అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రేన్ సహాయంతో బస్సును చెరువులో నుండి బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story