కిల్లీ కృపారాణి కల ఫలించేనా.. కృపారాణికి గట్టి పోటీనిస్తున్న మరో ఇద్దరు నేతలు

కిల్లీ కృపారాణి కల ఫలించేనా.. కృపారాణికి గట్టి పోటీనిస్తున్న మరో ఇద్దరు నేతలు
x
కిల్లీ కృపారాణి కల ఫలించేనా
Highlights

ఆమె మాజీ కేంద్రమంత్రి. కాంగ్రెస్‌ హయాంలో చక్రంతిప్పిన నాయకురాలు. రాష్ట్ర విభజన దెబ్బ, ఆమెకూ తగిలింది. 2019లోనూ ఆమె ఎక్కడి నుంచీ పోటీ చేయలేదు. కాదు...

ఆమె మాజీ కేంద్రమంత్రి. కాంగ్రెస్‌ హయాంలో చక్రంతిప్పిన నాయకురాలు. రాష్ట్ర విభజన దెబ్బ, ఆమెకూ తగిలింది. 2019లోనూ ఆమె ఎక్కడి నుంచీ పోటీ చేయలేదు. కాదు కాదు, వైఎస్ జగన్‌ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. కానీ హామి ఇచ్చారని అంటున్నారామె. అప్పుడు మాటిచ్చారు కాబట్టి, ఇప్పుడు రాజ్యసభ సీటిస్తారని గట్టిగా నమ్ముతున్నారు ఆ నాయకురాలు ఇంతకీ ఎవరామె ఆమె ఆశ తీరుతుందా?

రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న రాజకీయ నేతల్లో ఒక్కసారిగా హడావుడి మొదలయ్యిందట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఆ స్థానాలన్నీ పాలక పక్షమైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ ఒక్కసారిగా జోరందుకుంది.

ప్రధానంగా రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అంశాలతో ముందుకెలుతున్న అధికార వైసిపి, రాజ్యసభ సభ్యుల ఎంపికలోనూ అదే సూత్రాన్ని అనుసరిస్తుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోందట. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వుండేలా, అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు సైతం వైసీపీలో వినిపిస్తున్నాయట. అంతేకాదు, సామాజిక సమీకరణాలు కూడా పక్కాగా చూసుకుని, అభ్యర్థులను వడబోస్తోందట వైసీపీ. ఈ ఈక్వేషన్స్‌లో భాగంగానే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మాజీ కేంద్రమంత్రి చాలా ఆశలు పెట్టుకున్నారట.

ఉత్తారంధ్ర నుంచి మాజీ కేంద్ర మంత్రి కిల్లీ కృపారాణి రాజ్యసభ సభ్యులుగా అవకాశం లభిస్తుందనే చర్చ, సిక్కోలు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. 2019 ఎన్నికలకు స్వల్ప వ్యవధి ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కృపారాణి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే తానూ ఏమి ఆశించకుండానే పార్టీలో చేరానని ఆ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రజలకు, పార్టీకి నిస్వార్ధంగా సేవ చేసేందుకే పార్టీలో చేరానని కృపారాణి చెప్పినా, తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తానని జగన్ నుంచి ఆమెకు హామీ లభించిందని, అందుకే ఆమె పార్టీలో చేరారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగిందట.

కాగా రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువు తీరిన తరువాత తొలుత కృపారాణికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించేందుకు జగన్ భావించారట. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు కాబట్టి, ఈసారి కృపారాణికి రాజ్యసభ అభ్యర్ధిగా అవకాశం కన్ఫార్మ్ అని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. కృపారాణి బిసి వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో పాటు, మహిళా కోటా, ఉన్నత విద్య నేపథ్యం, గత అనుభవం వంటి అంశాలు ఆమెకు కలిసి వస్తాయని ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారట.

అయితే, రాజ్యసభపై కృపారాణి ఆశలు పెట్టుకున్నా, అవకాశం మాత్రం అంతగా కనపడటం లేదని పొలిటికల్ విశ్లేషకుల భావన. బీసీ వర్గానికి చెందిన మహిళ అయినప్పటికీ, అదే కోటాలో మోపిదేవి వెంకట రమణకు దాదాపు ఖాయమైందన్న చర్చ జరుగుతోంది. మండలి రద్దుతో ఆయన ఎమ్మెల్సీ పదవి కోల్పోతారు కాబట్టి, రాజ్యసభ ఇవ్వడం కన్‌ఫామ్ అన్న మాటలు వినపడ్తున్నాయి. ఒకవేళ, మండలి రద్దుకు చాలా టైముంది కాబట్టి, మోపిదేవికి ఇప్పుడే ఇవ్వకపోయినా, బీసీ కోటాలోనే నెల్లూరుకు చెందిన బీదా మస్తాన్‌రావుకు ఛాన్స్ దొరకొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ఎస్సీ, బీసీ, ఓసీ, ముస్లిం వర్గాల నుంచి ప్రాతినిథ్యం కల్పించేందుకు సీఎం జగన్ ఆలోచిస్తున్నారట. ఇదే జరిగితే, బీసీ వర్గం నుంచి మోపిదేవి, బీదా మస్తాన్‌రావులు కిల్లి కృపారాణికి గట్టి పోటీ ఇస్తున్నట్టే. మరి కిల్లీ కృపారాణి ఆశలు ఫలిస్తాయో, లేదో చూడాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories