Cargo Express Services By Railway in AP: ఇక నుంచి రైల్వేల్లోనూ కార్గో సేవలు.. వచ్చే నెల 5 నుంచి శ్రీకారం

Cargo Express Services By Railway in AP: ఏపీలో ఆర్టీసీ మాదిరిగా రైల్వేల్లేనూ కార్గో సేవలు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.

Bathula Yesu Babu
Published on: 24 July 2020 7:15 AM IST
Cargo Express Services By Railway in AP: ఇక నుంచి రైల్వేల్లోనూ కార్గో సేవలు.. వచ్చే నెల 5 నుంచి శ్రీకారం
X
Cargo Express Services

Cargo Express Services By Railway in AP: ఏపీలో ఆర్టీసీ మాదిరిగా రైల్వేల్లేనూ కార్గో సేవలు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. వాస్తవంగా చూస్తే రైల్వేలో ఆదాయం వచ్చేది కేవలం సరుకుల రవాణా మీదే. పాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లన్నీ కేవలం ప్రజల సౌకర్యార్ధమే. దీనిని రుజువు చేసింది లాక్ డౌన్. ఈ సమయంలో రెండు నెలల పాటు కేవలం ఒక్క పాసింజర్ రైలు తిరగకున్నా రైల్వే ఆదాయం వేల కోట్లలో ఉండేది. ఎందుకంటే ఆ సమయంలో గూడ్స్ రవాణాను నిలిపివేయకపోవడమే. ఈ సర్వీసుల్లో నిరంతరంగా సరుకులను రవాణా చేసేది. అందువల్లే దీని ఆదాయానికి ఎక్కడా ఇబ్బంది ఉండేదికాదు. అయితే ఇప్పటివరకు బల్క్ మొత్తంలో సరుకులు ఉంటేనే వ్యాపారులు, రైతుల నుంచి రైళ్లలో రవాణాకు వీలుకలిగేది. అయితే దానికి మరింత కుదించి వ్యాపారాన్ని విస్తరించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కార్గో సేవల పేరుతో తక్కువ పరిమాణంలో ఉన్న సరుకులను సైతం ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనిని బుక్ చేసుకునేందుకు ప్రత్యేక ట్విట్టర్ ఖాతాను తెరిచింది.

దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే కార్గో ఎక్స్‌ప్రెస్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు 5 నుంచి తొలి సర్వీసును ప్రారంభించనున్నారు. తొలుత హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వరకు పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద కార్గో ఎక్స్‌ప్రెస్‌ను నడపనుంది. చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా.. నాన్‌ బల్క్‌ (తక్కువ పరిమాణం)లో సరుకులు చేర్చాలని ఆ శాఖ నిర్ణయించింది. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు.. చిన్న పరిశ్రమదారులు తమ సరుకును కార్గో ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ఆయా ప్రాంతాలకు చేర్చే అవకాశం లభిస్తుంది. ఇక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా కూడా కార్గో బుకింగ్‌ చేసుకునేలా విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ వెల్లడించిన పూర్తి వివరాలు ఇవి..

– కార్గో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు సరుకును బట్టి మారతాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రవాణా చార్జీలు టన్నుకు సగటున రూ.2,500 వరకు ఉంటాయి.

– రోడ్డు రవాణా, ప్రస్తుత రైల్వే టారిఫ్‌తో పోలిస్తే 40 శాతం చార్జీలు తక్కువ.

– ట్విట్టర్‌ ద్వారా బుకింగ్‌ నిమిత్తం విజయవాడ రైల్వే కమర్షియల్‌ విభాగం అధికారులు సింగిల్‌ విండో క్లియరెన్స్‌ సిస్టం అందుబాటులోకి తెచ్చారు.

– బుకింగ్‌ కోసం ట్విట్టర్‌ అకౌంట్‌ Vijayawada_RailFreight (@Bzarailfreight) ద్వారా రైల్వే అధికారులను పని దినాల్లో సంప్రదించాల్సి ఉంటుంది.

– వినియోగదారులు సరుకు రవాణా రిజిస్ట్రేషన్, వ్యాగన్ల బుకింగ్‌ కోసం సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజరును, లేదా దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లోనూ సంప్రదించవచ్చు.

Bathula Yesu Babu

Bathula Yesu Babu

Next Story