Andhra Pradesh: పీకే డైరెక్షన్‌.. జగన్‌ యాక్షన్‌

Prashant Kishor Strategy On YS Jagan Cabinet Expansion..?
x

పీకే డైరెక్షన్‌.. జగన్‌ యాక్షన్‌

Highlights

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో ఏం జరుగుతోంది.? మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏ అభిప్రాయంతో ఉన్నారు?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో ఏం జరుగుతోంది.? మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏ అభిప్రాయంతో ఉన్నారు? వారి పనికి సీఎంగా ఆయనిచ్చే మార్కులు ఎన్ని? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రివర్గ కూర్పు సమయంలో అనేక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న జగన్ వారిని కంటిన్యూ చేయబోతున్నారా? ఇష్యూ పరిశీలిస్తున్నారా? మొదట్లో 90 శాతం మార్కులు వస్తేనే సరి లేకుంటే కత్తెర అని హెచ్చరించిన సీఎం కొందరి పనితీరు మీద అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం మధ్య మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది? పీకే డైరెక్షన్‌లో జగన్‌ ఇప్పుడేం చేయబోతున్నారు? పీకే పని మొదలు కాలేదనే మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్నారా? ఏపీ మంత్రుల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

ఏపీ అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారిందీ అంశం. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రాంతీయ- సామాజిక సమీకరణాలతో మంత్రివర్గానికి కూర్పు చేశారు. అందులో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. దీంతో పాటుగా పదవులు ఇచ్చే రోజే వారికి లక్ష్యం నిర్ధేశించారు. రెండున్నరేళ్ల పాటే మంత్రులుగా కొనసాగుతారని, పని తీరు ఆధారంగా కొందరు కంటిన్యూ అవుతారని తేల్చిచెప్పారు. అయితే, ఇప్పటికే మంత్రులుగా వ్యవహరిస్తున్న వారి పదవీకాలం ముగియబోతోంది. ఇదే ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయన్న టాక్‌ జోరుగా నడుస్తోంది. ఇన్ అయ్యేది ఎవరు? ఔట్ అయ్యేది ఎవరన్న చర్చ జరుగుతోంది. మారబోయే సమీకరణాలుపై అంచనాలు వేసుకుంటున్నారు. జరగబోయే లెక్కలను బేరీజు వేసుకుంటున్నారు. రెండున్నరేళ్లలో మార్పు తప్పదన్న ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటతో తమకు అవకాశం వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తుంటే తమకేమవుతుందోనని ఇప్పుడున్న అమాత్యులు పరేషాన్‌ అవుతున్నారట. వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ డైరెక్షన్‌లో నడిచేందుకు జగన్‌ మంత్రులకు ఓ చాన్స్‌ కూడా ఇచ్చారన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది.

వైఎస్. జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పడి, రెండున్నరేళ్లు దగ్గరకొస్తోంది. అందుకే అంద‌రి దృష్టి కేబినెట్‌ విస్తరణపై పడింది. ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల త‌రువాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీతో ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా రోజా, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణరెడ్డి, దాడిశెట్టి రాజా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా ఇంకొందరు నేతలు పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. వీరితో పాటు అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరు ఔట్ అవుతారన్న దానిపైన్నే పార్టీలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. సీఎం చెప్పిన అందరికీ రెండున్నరేళ్లే అన్న మాటలని లెక్కలోకి తీసుకుంటే 10 మందిని ఉంచి, మిగిలిన 15 మంది స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారని పార్టీలో కీలక నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో సీనియర్లతో పాటు మొదటిసారి మంత్రి అయిన వారిలోనూ కొందరిని కొనసాగిస్తారని సమాచారం. వీరిలో ఫైర్‌బ్రాండ్స్‌గా ఉన్న మంత్రులను కొనసాగించే అవకాశం ఉందన్న టాక్‌ నడుస్తోంది. వచ్చేది ఎన్నికల ఇయర్ కాబట్టి వారికి తోడు మరికొందరు ఫైర్ బ్రాండ్స్‌కి క్యాబినెట్‌ బెర్త్‌ ఖాయమన్న సంకేతాలు పార్టీలో కనిపిస్తున్నాయి.

అయితే, తన కేబినెట్‌లోని మంత్రుల గురించి పూర్తి సమాచారంతో ఉన్న సీఎం పార్టీ కేడర్‌తో వారి సంబంధాలపై ఆరా తీస్తున్నారట. ఇది ఇప్పుడు మంత్రుల మధ్య హాట్‌టాపిక్‌గా మారుతోంది. తాను ఏరి కోరి తెచ్చుకున్న కొందరి మంత్రులపై సీఎం అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మధ్య కంటిన్యూ అవ్వాలని చూస్తున్న మంత్రులు కొందరు మంత్రివర్గ విస్తరణలో తమ పరిస్థితి ఏంటన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నారట. అదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న అమాత్యులు కొందరు తమ సొంత జిల్లాలో పార్టీ పరిస్థితులు కేడర్‌తో మమేకం అవటం క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాలు తెలుసుకోవటంలో సరైన చొరవ చూపకపోవటంపైనా సీఎం ఆగ్రహంగా ఉన్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన టీమ్‌ ద్వారా జగన్‌కు మంత్రుల పని తీరు మీద కొన్ని నివేదిక ఇచ్చారట. అందులో ఎవరెవరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ఎవరు సామాజిక కోణంలో పనితీరు కనబరుస్తున్నారు మంత్రులుగా అవకాశం ఇస్తే ఎవరెవరు మళ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తారు ఇలా అనేక విషయాల మీద పీకే టీమ్‌ వర్కవుట్‌ చేస్తోందట. ఈ పని ఇంకా నడుస్తుందని కొందరు అబ్బే అసలు మొదలే కాలేదని మరికొందరు చెబుతుంటే పీకే పని లేట్‌ అవడం వల్లే మంత్రివర్గ విస్తరణ కూడా ఈ డిసెంబరులో కాకుండా మరో ఆరునెలలు పొడిగించే అవకాశం ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి సీఎం మనసులో ఏముందో, ఎవరున్నారో అనే దానిపై అంచనా వెయ్యడం కష్టమే అంటున్నారు పార్టీ నేతలు. చూడాలి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా తన మంత్రులపై జగన్‌ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో!!

Show Full Article
Print Article
Next Story
More Stories