ఏపీలో భారీగా విద్యుత్ కొరత.. పవర్ హాలిడే.. ట్రాన్స్ కో కీలక నిర్ణయం...

AP News: 15రోజుల్లో విద్యుత్ డిమాండ్ దిగివస్తుందని ఆశాభావం...

Shireesha
Published on: 8 April 2022 7:01 AM IST
Power Cuts in AP due to Shortage | AP Live News
X

ఏపీలో భారీగా విద్యుత్ కొరత.. పవర్ హాలిడే.. ట్రాన్స్ కో కీలక నిర్ణయం...

AP News: ఏపీని విద్యుత్‌ కొరత వెంటాడుతోంది. ఏపీ ప్రజలను కరంట్ కోతలు వేధిస్తున్నాయి. రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు పోతుందో. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు దాపరించాయి. దీంతో ఏపీ ట్రాన్స్ కో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలో ఏప్రిల్ 8 నుంచి 22 వరకు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడుకోవాలని ఆదేశించింది.

పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే విధిస్తున్నట్లు, వారాంతపు సెలవుకు ఇది అదనంగా ఉంటుందని ట్రాన్స్ కో వెల్లడించింది. ఈ మేరకు మూడు డిస్కంల పరిధిలో పవర్ హాలిడే ప్రకటనలు విడుదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని ఏపీ ట్రాన్స్ కో వెల్లడించింది. అయితే గృహ అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు ఆటంకం కలగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో షాపింగ్ మాల్స్‌ ల్లో 50శాతం మాత్రమే ఏసీలను వినియోగించాలని సూచించింది. అలాగే హోర్డింగ్ లు, సైన్ బోర్డులకు విద్యుత్ వినియోగించకూడదని ఆదేశించింది ప్రభుత్వం. వచ్చే 15రోజుల్లో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ దిగివస్తుందని సరఫరా మెరుగయ్యే అవకాశాలున్నాయని ఏపీ ట్రాన్స్ కో తెలిపింది. వైసీపీ పాలనలో ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ ఓ వీడియోను జత చేశారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిన బిల్లులను ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా.. ఈ కోతలు ఎందుకని ప్రశ్నించారు చంద్రబాబు. ఓ వైపు గ్రామ గ్రామాన ప్రజలు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.

Shireesha

Shireesha

Next Story