ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సహాయ నిరాకరణ?

Arun Chilukuri
Published on: 22 Jan 2021 7:54 PM IST
ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సహాయ నిరాకరణ?
X

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సహాయ నిరాకరణ?

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దూకుడుగా వెళ్తున్న ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉన్నతాధికారులు, ఉద్యోగుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. రేపు తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ కు సిద్ధమవుతోన్న ఎస్ఈసీకి పంచాయతీరాజ్ శాఖాధిపతులు షాకిచ్చారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, నోటిఫికేషన్ రిలీజ్ పై చర్చించేందుకు నిర్వహించిన సమావేశానికి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ డుమ్మాకొట్టారు. ఈ ఉదయం 10గంటలకు సమావేశానికి రాకపోవడంతో మీటింగ్ ను మధ్యాహ్నం మూడు గంటలకు మార్చారు. మూడు గంటలకు కూడా రాకపోవడంతో ఏపీ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. సమావేశానికి హాజరుకాకపోవడాన్ని సీరియస్ గా పరిగణించి చివరి అవకాశం ఇచ్చారు. తన ముందు హాజరుకావాలంటూ ఏపీ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు మెమో జారీ చేశారు. అయితే, 5గంటలకు కూడా పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు డుమ్మాకొట్టడం సంచలనంగా మారింది. మరోవైపు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి చర్చించడం.

పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారుల నుంచే కాకుండా ఉద్యోగుల నుంచి కూడా ఎస్‌ఈసీకి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఇప్పటికే గవర్నర్‌‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు కరోనా పరిస్థితులు, వాక్సినేషన్ కారణంగా పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సీఎస్ ఆదిత్యానాథ్‌ దాస్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కరోనా పరిస్థితులు, వాక్సినేషన్ కారణంగా పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని తెలిపారు.

ఇదిలాఉంటే, రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 10గంటలకు తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించనున్నారు. నోటిఫికేషన్‌ జారీకి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశించారు. అయితే, నోటిఫికేషన్ ప్రకటన, ప్రెస్‌నోట్ రిలీజ్‌కే పరిమితం కావాలని కలెక్టర్లకు ఎస్‌ఈసీ సూచించారు. ఇక, నోటిఫికేషన్ విడుదలకు ముందు రేపు ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story