స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి SEC కౌంటర్

Arun Chilukuri
Published on: 17 Dec 2020 4:44 PM IST
స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి SEC కౌంటర్
X

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో కుదరదని ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కౌంటర్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉందని వాటికి ఇంకా క్లినికల్ అప్రూవల్స్ కూడా రాలేదని ఈసీ తెలిపింది. వ్యాక్సిన్ రావడానికి ఇంకా మూడు నుంచి ఆరునెలల సమయం ఉందని అదికూడా తొలి ప్రాధాన్యతగా ఒక వర్గానికి మాత్రమే వేయాలని అందరికీ కాదన్నది జాతీయ విధానమని ఎన్నికల కమిషన్ కౌంటర్ లో పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పిటిషన్ ను డిస్మిస్ చేయాలని కోరింది.

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగబద్ధ సంస్థకు ఉన్న హక్కులను ఉల్లంఘిస్తోందనీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని గతంలోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని కమిషన్ వివరించింది. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశంలో పలుచోట్ల ఎన్నికల నోటిఫికేషన్లు కూడా వెలువడిన అంశాన్ని గుర్తించాలని కోరింది. ఏపీలో కరోనా తగ్గిందని స్కూల్స్, మాల్స్, థియేటర్లు తెరవడానికి అనుమతి ఇచ్చిందని ఆ ఆదేశాలతోనే కరోనా తగ్గముఖం పట్టిందన్న సంకేతాలు ఇచ్చిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు కూడా జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. బీహార్, రాజస్థాన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కూడా ఓకే చెప్పిందన్న అంశాన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హై కోర్టు కు తెలియ చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story