అంకులు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్
Nara Lokesh : తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల హత్యలు సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారాయన. అంకులు కుటుంబ సభ్యుల్ని లోకేష్ పరామర్శించారు. హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు.
జనవరి ఒకటిన వైసీపీ ఎమ్మెల్యే గ్రామానికి వచ్చారని చెప్పారు లోకేష్. అధికారిక కార్యక్రమాల తర్వాత వైసీపీ నేతలతో రహస్యంగా సమావేశమయ్యారని ఆ తర్వాత రెండు రోజులకే హత్య జరిగిందన్నారు. రహస్య సమావేశంలోనే హత్యకు స్కెచ్ వేశారా అని ప్రశ్నించారు టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దేవతలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడితో ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సీఎం జగన్ను ఉద్దేశించి అన్నారు. పొరపాటున ఇంకో టీడీపీ కార్యకర్త జోలికి వస్తే జరగబోయే పరిణామాలకు జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.




