సుబ్బయ్య హత్య కేసులో రాజకీయ దుమారం

Arun Chilukuri
Updated on: 31 Dec 2020 10:00 PM IST
సుబ్బయ్య హత్య కేసులో రాజకీయ దుమారం
X

కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ నేత సుబ్బయ్య హత్య కేసులో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ కేసులో న్యాయం జరగకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని టీడీపీ హెచ్చరిస్తుంటే మీడియాలో ఫోకస్ అయ్యేందుకు వాళ్లు శవరాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణహత్యకు గురైన టీడీపీ నాయకుడు సుబ్బయ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సుబ్బయ్య అంత్యక్రియలకు పలువురు టీడీపీ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. బాధిత కుటుంబాన్ని, సాక్షులను ప్రలోభపెట్టినా వారికి ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యత అని ఆరోపించారు. పోలీసులు ఇచ్చిన హామీ మేరకు సుబ్బయ్య కుటుంబానికి న్యాయం జరగకపోతే మళ్లీ ప్రోద్దుటూరుకు వస్తానని మళ్లీ దీక్షకు దిగుతానని చెప్పారు.

మీడియాలో ఫోకస్ అయ్యేందుకు సుబ్బయ్య హత్యపై టీడీపీ శవరాజకీయం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సుబ్బయ్య హత్య కేసును స్థానిక ఎమ్మెల్యే రాచమల్లుకు అంటగట్టడం దారుణమని చెప్పారు. సుబ్బయ్య నేర చరిత్ర ఉన్న వ్యక్తి అని అది రాజకీయ హత్య కాదని అన్నారు. ఇక సుబ్బయ హత్య కేసుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్‌ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని టీడీపీ డిమాండ్ చేస్తుండగా దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ అనురాధ అన్నారు. ఘటన తర్వాత తాను అజ్ఞాతంలోకి వెళ్లానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు. ఇక అటు సుబ్బయ్య కుటుంబానికి పార్టీ తరఫున 20లక్షలు ఆర్థిక సాయంప్రకటించారు నారా లోకేష్. జిల్లా నేతలు మరో 14లక్షలు సాయం చేశారని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story