జంటనగరాలుగా విశాఖ-విజయనగరం అభివృద్ధికి ప్లాన్ !

Arun Chilukuri
Published on: 3 Sept 2020 4:32 PM IST
జంటనగరాలుగా విశాఖ-విజయనగరం అభివృద్ధికి ప్లాన్ !
X

సాగరనగరం పరిపాలన పట్టణంగా మారుతున్న వేళ వైజాగ్ మీద ఫోకస్ పెంచుతుంది ప్రభుత్వం. విశాఖ, విజయనగరాలను కలుపుతూ ట్వీన్ సీటీస్ గా అభివృద్ది చేసేందుకు మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేస్తోంది. ముఖ్యంగా రాజధాని పరిధి ఎలా వుండాలి..? రానున్న రోజుల్లో విశాఖ ముఖచిత్రం ఏ విధంగా మార్పు చెంది అభివృద్ది వైపు అడుగులు వేయాలి..? అనే అంశంపై పరఫెక్ట్ ప్లానింగ్ ను జగన్ సర్కార్ రూపొందిస్తుంది.

విశాఖపట్నం పేరు ప్రపంచ పఠంలో ఇప్పటికే ప్రత్యేక స్థానం ను సంపాదించుకుంది. పారిశ్రామిక, పర్యాటక అభివృద్దితో మెట్రో నగరాల జాబితాలో చేరిపోయింది. తాజాగా రాజధాని నగరంగా వినుతికెక్కుతుంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలు రానున్న రోజుల్లో అభివృద్దికి చిరునామాగా మారుతున్నాయి. ఒకవైపు సముద్రం, మూడు వైపుల భూ భాగం వున్న విశాఖలో పారిశ్రామిక ప్రగతి 40 ఏళ్ల క్రితం నుండే ప్రారంభం అయింది. ప్రస్తుతం 625 చదరపు అడుగుల వీస్తీర్ణంతో 23 లక్షల జనభాతో విశాఖ విస్తరించింది. అనకాపల్లి, భీమిలిని కలుపుకుని కార్పోరేషన్ పరిధిని విస్తరించింది. తాజాగా రాజధాని ప్రతిపాదనలతో విజయనగరం వరకు పరిధి పెంచి ట్వీన్ సీటీస్ గా డవలప్ చేసేందుకు ప్రభుత్వం మౌళిక వసతుల పై ఫోకస్ పెంచింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే 6 లైన్ల రహదారితో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పనులను ప్రారంభించింది.

ఇప్పటికే విశాఖ వీఎమ్ఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1312 గ్రామలను విస్తరించుకుంది. ప్రస్తుతం రాజధాని నిర్మాణాలలో భాగంగా నగర జనాభా అవసరాలకు తగినట్లు మౌలిక వసతులను పెంచుతుంది. మరో వైపు అనకాపల్లి నుండి భీమిలి వరకు రానున్న మెట్రో కారిడార్, విశాఖ ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు రానున్న ట్రామ్ ట్రైన్ ప్రతిపాదనల వెంబడి మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేస్తుంది. మరోవైపు విజయనగరం వరకు భోగాపురం ఎరో సీటీ, ఐటీ హబ్స్, టూరిజం హబ్స్ కు రూపకల్పన చేస్తుంది. అలాగే విజయనగరం వరకు శాటిలైట్ టౌన్ షిప్స్ ను నిర్మించనున్నారు. మంచి రెసిడెన్షియల్ ఏరియాగా విజయనగరం పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దనున్నారు.

ఇక విశాఖలో పారిశ్రామిక రంగంకు పెద్ద పీట వేస్తుంది ప్రభుత్వం. పెట్రోల్ కారిడార్స్ దానికి అనుబంధంగా వుండే పరిశ్రమలలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు సుదీర్ఘమైన సముద్రతీరం ను ఉపయోగించుకుని సముద్ర ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలపై ప్రభుత్వం ఫోకస్ పెంచుతుంది. ఆ విధంగా రానున్న 40 ఏళ్లలో 48% పారిశ్రామిక ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరో వైపు విశాఖాలో వున్న సహజసిద్ద పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేసి సినీ హబ్ గా కూడా తీర్చిదిద్దేందుకు సింగిల్ విండో విధానంలో సినీ పరిశ్రమకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే విశాఖాలో రామానాయుడు స్టూడియో వుంది. అనేక చిత్రాలు షుటింగ్ లు జరుపుకుంటున్నాయి. సినీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా చెన్నై తరహా అభివృద్ది సాధించే ప్రక్రియను ముందకు తీసుకువెళ్తున్నారు.

విశాఖ అంటేనే సుందర నగరం, ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. టూరిజం సీటీగా పేరున్న విశాఖాలో అరకు, బీచ్, భీమిలి, ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం ను డవలప్ చేయనుంది. ఇందుకోసం అతిధ్య రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ ప్రోజెక్టులకు రూపకల్పన చేయనున్నారు. ఈ విధంగా రానున్న రోజుల్లో సమగ్ర అభివృద్దితో ఉత్తరాంధ్రాను ప్రగతిపథంలో తీసుకువెళ్లాలనే లక్ష్యంతో విజన్ డాక్యూమెంట్ ను సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి లేక ఉత్తరాంధ్రావాసులు వలసలు పోతున్న తరుణంలో రానున్న రోజుల్లో వలసలకు అడ్డుకట్ట వేసి ఈ ప్రాంతంలోనే ఉపాధి మార్గాలు పెరిగే విధంగా అభివృద్ది జరగాలని ఈ ప్రాంతీయులు ఆకాంక్షిస్తున్నారు. ట్వీన్ సీటీస్ గా విశాఖ, విజయనగరం అభివృద్ది చెందితే ఈ రెండు నగరాలకు అనుబంధంగా ఉన్న శ్రీకాకుళం, గోదావరి జిల్లాలు కూడా కనక్టీవీటీ పెంచుకుని అభివృద్ది జరిగే అవకాశం వుంటుంది. ఏది ఏమైనా విశాఖాతో పాటు ఉత్తరాంధ్రా అంతా రాజధాని మాస్టర్ ప్లాన్ తో అభివృద్ది వైపు అడుగులు వేయడం మాత్రం శుభపరిణామం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story