Malikipuram ONGC Blowout: 20 గంటల తర్వాత తగ్గుముఖం.. ఇంకా అదుపులోకి రాని మంటలు

మలికిపురం ONGC గ్యాస్ బావి బ్లోఅవుట్ ఘటనలో 20 గంటల తర్వాత మంటలు తగ్గుముఖం పట్టాయి. బావిలో 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్లు అంచనా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Jan 2026 11:52 AM IST
Malikipuram ONGC Blowout: 20 గంటల తర్వాత తగ్గుముఖం.. ఇంకా అదుపులోకి రాని మంటలు
X

Malikipuram ONGC Blowout: 20 గంటల తర్వాత తగ్గుముఖం.. ఇంకా అదుపులోకి రాని మంటలు

కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో చోటుచేసుకున్న ONGC గ్యాస్ బావి బ్లోఅవుట్ ఘటన తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. సుమారు 20 గంటలుగా భీకరంగా ఎగిసిపడిన మంటలు ప్రస్తుతం కొంత మేరకు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

నిన్న గ్యాస్ లీక్‌తో ప్రారంభమైన ఈ ఘటన బ్లోఅవుట్‌గా మారడంతో, బావి నుంచి 100 అడుగులకుపైగా అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. పెద్దపెద్ద శబ్దాలతో మంటలు మండుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో పలు కొబ్బరి చెట్లు పూర్తిగా కాలిపోగా, సమీప నివాసాలపై ప్రభావం పడింది.

భద్రతా చర్యలలో భాగంగా బ్లోఅవుట్ కేంద్రానికి కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక పునరావాస ఏర్పాట్లు చేశారు. అగ్నిప్రమాద నియంత్రణ దళాలు, ONGC ప్రత్యేక బృందాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాయి.

అధికారుల అంచనాల ప్రకారం, సంబంధిత బావిలో సుమారు 40 వేల క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ పూర్తిగా వెలువడే వరకు మంటలు కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంటలు ఎప్పుడు పూర్తిగా అదుపులోకి వస్తాయో ఖచ్చితంగా చెప్పలేమని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన అన్ని సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల్లో భయాందోళనలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story