Madanapalle Child Murder Case: మదనపల్లిలో ఘోరం... ప్లాస్టిక్ డ్రమ్ములో ఏడేళ్ల చిన్నారి మృతదేహం.. పక్కింటి వ్యక్తి పనేనా?
Madanapalle Child Murder Case: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో అత్యంత పశుప్రాయమైన ఘటన వెలుగుచూసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో అత్యంత పశుప్రాయమైన ఘటన వెలుగుచూసింది. ఆడుకుంటూ కళ్లముందు ఉండాల్సిన ఏడేళ్ల పసిప్రాయం కామాంధుడి చేతిలో బలైపోయింది. నిన్న సాయంత్రం అదృశ్యమైన రిషిక ప్రియ అనే చిన్నారి, చివరికి పక్కింట్లోనే శవమై తేలడం స్థానికంగా పెను కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రిషిక ప్రియ (7), నిన్న సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైంది. రాత్రి అవుతున్నా కూతురు ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డ్రమ్ములో మృతదేహం లభ్యం:
పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టగా, పక్కింటి వ్యక్తి ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఆ ఇంటిని తనిఖీ చేయగా, ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో చిన్నారి మృతదేహం బయటపడింది. చిన్నారిని గొంతు నులిమి చంపినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు.
నిందితుడి కోసం వేట:
ఈ అమానవీయ ఘటనపై మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిపై అత్యాచారయత్నం జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.




