Land for tribals: ఏపీలో గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగేది ఆరోజే!

Land for tribals: ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న గిరిజనుల భూములకు పట్టాలు మంజూరు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.

admin1
Published on: 11 July 2020 8:08 AM IST
Land for tribals: ఏపీలో గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగేది ఆరోజే!
X
Land for tribals

Land for tribals: ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న గిరిజనుల భూములకు పట్టాలు మంజూరు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టంలో భాగంగా 2005 డిశెంబరుకు ముందు అటవీ భూమిలో సాగులో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని చట్టం చెబుతున్నా, స్థానిక కారణాలు, అటవీ అధికారుల వల్ల వీటి పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రారంభంలో దివంగత నేత వైఎస్ చాలావరకు పట్టాలు పంపిణీ చేయగా, తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ నిబంధనల ప్రకారం సాగులో ఉన్నవారందరకీ పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయంచి, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

క్లెయిములను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

► అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాలి. పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ తయారు చేయాలి.

► ఆ భూముల్లో ఏయే పంటలు సాగు చేయాలన్న దానిపై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. ఇందుకోసం వ్యవసాయ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలి.

► ఇందుకోసం గిరిభూమి పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

గిరిజనం కోసం సీఎం చొరవ

► గిరిజన రైతులు రిజర్వు ఫారెస్ట్‌ను ఆనుకుని చాలా వరకు సాగు చేసుకుంటున్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల కోసం దరఖాస్తులు చేశారు. అయితే అధికారుల పరిశీలనలో ఇవి బంజరు భూములుగా తేలడంతో మొదట ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

► ఈ విషయం సీఎం జగన్‌ దృష్టికి వెళ్లడంతో వారందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

► బంజరు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులు సుమారు 10 వేల మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. 21 వేల ఎకరాల బంజరు భూముల్లో ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నారు.

► పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు ఫారెస్ట్‌ వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూమి హక్కు పత్రాలు ఇస్తారు.

► వైఎస్సార్‌ హయాంలో లక్షల మంది గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారు.

► గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ద్వారా కొంటోంది.

admin1

admin1

Next Story