కృష్ణా జిల్లాలో డ్రైరన్‌ నిర్వహణకు సన్నాహాలు

Arun Chilukuri
Published on: 26 Dec 2020 7:23 PM IST
కృష్ణా జిల్లాలో డ్రైరన్‌ నిర్వహణకు సన్నాహాలు
X

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కోసం దేశంలో నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇందులో వైద్యాశాఖ అధికారులు కృష్ణా జిల్లాను ఎంపిక చేసుకున్నారు. వ్యాక్సినేషన్ నిర్వహణకు కార్యాచరణ ఎలా ఉండాలో అంచనా వేసేందుకు డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 28న 5 లొకేషన్లలో డ్రైరన్‌ నిర్వహించనున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పూర్ణా హార్ట్ ఇన్‌స్టిట్యూట్, పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రకాశ్‌ నగర్‌లోని ఈయూపీ హెల్త్‌ సెంటర్‌లో డ్రైరన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ప్రతి లొకేషన్లలో ఐదుగురు సభ్యులతో ఒక టీం ఏర్పాటు ఏఎన్‌ఎం, ఆశావర్కర్, అంగన్‌వాడీ వర్కర్, పోలీసు సిబ్బంది సభ్యులుగా ఉంటారు. హెల్త్‌ కేర్ వర్కర్స్, ఫ్రంట్‌ లైన్ వారియర్స్‌కి మాత్రమే వ్యాక్సినేషన్ వేస్తారు. వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక 30నిమిషాల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు.

ఈ డ్రైరన్‌లో ఎవరికీ వ్యాక్సిన్ వేయరు. కేవలం ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ వేసే సమయంలో నిర్వహణ పద్ధతిని ఈ డ్రైరన్ లో అంచనా వేస్తారు. కోవిన్ యాప్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేసేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తారు. వ్యాక్సిన్ భద్రపరిచేందుకు అవసరమైన చర్యలను పరిశీలిస్తారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని సమీకరించడంపై దృష్టిపెడతారు. రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని సమీక్షించి, కార్యాచరణకు అవసరమైన సమచారంపై అవగాహనకు వస్తారు.

వ్యాక్సినేషన్‌కు అవసరమైన ఆరోగ్య కార్యకర్తల బృందాన్ని గుర్తించి ఆ జాబితాను కో విన్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ అనంతర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. డ్రైరన్ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ సమీక్షించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story