రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం.. రేవంత్‌తో చీకటి ఒప్పందమా?: మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు

రాయలసీమ ప్రాంతానికి జీవనాడి అయిన 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్' (RLIS) ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 8 Jan 2026 3:03 PM IST
రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం.. రేవంత్‌తో చీకటి ఒప్పందమా?: మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు
X

రాయలసీమ ప్రాంతానికి జీవనాడి అయిన 'రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్' (RLIS) ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, రాయలసీమ హక్కులను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

రేవంత్ వ్యాఖ్యలపై మౌనం ఎందుకు?

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "నేను అడగగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపేశారు" అని ప్రకటించడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. "పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రాజెక్టును ఆపించామని గొప్పగా చెప్పుకుంటుంటే.. ఏపీ ప్రభుత్వం కనీసం ఎందుకు స్పందించడం లేదు? దీని వెనుక చంద్రబాబు-రేవంత్ మధ్య ఏదైనా రహస్య ఒప్పందం ఉందా?" అని జగన్ ప్రశ్నించారు.

రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు: జగన్ ఫైర్

విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ ఈ అంశంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం రాయలసీమ గొంతు కోస్తున్నారని, సొంత రాష్ట్రాన్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం నీటి మట్టం 800 అడుగుల వద్ద ఉన్నప్పుడే నీటిని వాడుకునేలా తమ ప్రభుత్వం 85% పనులు పూర్తి చేసిందని, కానీ ఇప్పుడు అనుమతుల పేరుతో ప్రాజెక్టును పక్కన పెట్టడం అన్యాయమని జగన్ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం అంటే ఆ ప్రాంత రైతాంగానికి మరణశాసనం రాసినట్లేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం వివరణ

మరోవైపు జగన్ విమర్శలను కూటమి ప్రభుత్వం కొట్టిపారేసింది. జగన్ హయాంలో ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా, తప్పుడు విధానాల్లో ప్రాజెక్టును చేపట్టడం వల్లే ఎన్జీటీ (NGT) దీనిని నిలిపివేసిందని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ కోణంలో చేసినవేనని, రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story