వారిద్దరూ భార్యా, భర్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే భార్య ఒక పార్టీలో ఉంటే, భర్త మరొక పార్టీ భార్య...
వారిద్దరూ భార్యా, భర్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే భార్య ఒక పార్టీలో ఉంటే, భర్త మరొక పార్టీ భార్య కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలో ఉంటే, భర్త రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఇద్దరూ ఎవరి రాజకీయంలో వారు బిజీగా వున్నారు అయితే ఒకే ఇంట్లో రెండు జెండాలున్నా వీరు సఖ్యతగానే వున్నారు కానీ, పార్టీల అధినాయకుల్లోనూ అపార్థాలు పెరుగుతున్నాయట. బీజేపీ నేతలు వైసీపీ సర్కారు మీద మాటల దాడి పెంచడంతో, భర్తపై జగన్ సర్కారు నిఘా పెట్టిందన్న ఊహాగానాలు చక్కర్లుకొడుతున్నాయి. సొంత పార్టీ నేతపైనే జగన్ నిఘా పెట్టారన్న దాంట్లో నిజముందా ఏ పరిణామాలు ఇలాంటి చర్చను వేడెక్కిస్తున్నాయి?
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీ నాయకుడు. దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ నాయకురాలు. ఇద్దరూ భార్యాభర్తలు ఒకే ఇంట్లోనే వుంటారు కానీ పార్టీలు మాత్రం వేరువేరు గత ఎన్నికల్లోనూ ఇద్దరూ వేరువేరు పార్టీల తరపునే పోటీ చేశారు. భార్య ఒక పార్టీలో, భర్త మరో పార్టీలో అంటూ విమర్శలు చెలరేగినా, దగ్గుబాటి దంపతులు మాత్రం ఎవరికి వారు తమతమ పార్టీలలో ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. ఎన్టీఆర్ అల్లుడిగా రాష్ట్రంలో ఒకస్థాయి ఉన్న రాజకీయ నాయకుడిగా దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు గుర్తింపు ఉంది. అలాగే కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఆయన భార్య పురందేశ్వరి కూడా రాష్ట్ర రాజకీయాలలో కీలక వ్యక్తిగా వున్నారు.
మారిన రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరగా, మొన్నటి ఎన్నికల వరకు మౌనంగా, తటస్థంగా ఉన్న వెంకటేశ్వరరావు కుమారుడితో కలిసి వైసీపీలోకి వెళ్లారు. కుమారుడు హితేష్కు సీటు కోసం శతవిధాలా ప్రయత్నించి, సఫలమయ్యారు. కానీ సాంకేతిక కారణాలతో ఆయన కొడుకు పోటీ చేయడానికి ఆస్కారం లేకపోవడంతో, పర్చూరులో తానే పోటీ చేశారు. అయితే ఓటమి ఎరుగని నేతగా ఉన్న దగ్గుబాటికి, అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
అయినప్పటికీ పర్చూరు నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు అయ్యేలా దగ్గుబాటి చూసుకుంటున్నారని, వైసీపీలో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జ్గా అధికారుల బదిలీల్లో తనమాటే చెల్లుబాటు అయ్యేలా, చక్రంతిప్పుతున్నారన్న చర్చ సాగుతోంది. మార్టూరు ఎస్సై బదిలీ వివాదమైంది. దగ్గుబాటి సిఫార్సు మేరకే, జిల్లామంత్రి బాలినేని సూచనతో ఎస్పీ అక్కడకు బదిలీ చేసిన ఎస్సైను రోజుల వ్యవధిలోనే తిరిగి బదిలీ చేశారని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు.
ఇటీవల డాక్టర్ దగ్గుబాటి ఆయన కుమారుడు కలిసి మండలాల వారీగా, ఇటు అధికారులు అటు పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారట. నియోజకవర్గంలో ప్రతీదీ తన కనుసన్నల్లోనే జరగాలని, దగ్గుబాటి పట్టుబడుతున్నారట. ఈ నేపథ్యంలో డాక్టర్ దగ్గుబాటి పోకడపై పార్టీ అధిష్టానం దృష్టి సారించిందన్న విషయం, పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం జగన్ కూడా ఆరా తీశారని కొందరు మాట్లాడుకుంటున్నారట. నిఘా విభాగం అధికారులు ప్రత్యేకంగా ఆ నియోజకవర్గ సమాచారాన్ని పసిగడుతున్నట్లు సమాచారం. సొంత పార్టీ నాయకుడిపై అదే పార్టీ ప్రభుత్వం నిఘా ఎందుకు పెట్టిందన్న చర్చ హాట్హాట్గా సాగుతోంది.
అయితే ఈ నిఘాకు దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఇటీవల రాష్ట్రప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కారణమని స్థానికంగా మాట్లాడుకుంటున్నారట. ఎన్నికల వరకు బీజేపీ, వైసీపీ మధ్య సఖ్యత బాగానే వున్నా, ఏపీలోనూ బలపడాలనుకుంటున్న బీజేపీ, జగన్ ప్రభుత్వంపై విమర్శల వాడిని పెంచింది. ఆ నేపథ్యంలోనే కన్నాతో పాటు అనేకమంది బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పురందేశ్వరి కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. పురంధ్రీశ్వరి అటాకింగ్ నేపథ్యంలోనే, భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై వైసీపీ అధిష్టానం నిఘా పెట్టిందని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇటీవల సీఎం జగన్ కూడా బీజేపీ వైఖరి, రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యానాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి, సమీక్షిస్తున్నట్లు తెలిసింది. పురంధ్రీశ్వరి విమర్శలు, ఆరోపణలను కూడా సీఎం జగన్ ప్రస్తావిస్తూ, పర్చూరులో పరిస్థితి ఏమిటి, ఆమె భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఖరి ఎలా ఉంది అని ఆరా తీశారన్న చర్చ సాగుతోంది. అందుకే నిఘా వర్గాల అధికారులు పర్చూరు నియోజకవర్గానికి వెళ్లి, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, నివేదికలు ఇస్తున్నారని తెలుస్తోంది.
అయితే, ఒకే ఇంట్లో రెండు జెండాలుండటంతో, సహజంగానే అపార్థాలకు ఆస్కారం ఏర్పడుతుందని, దగ్గుబాటి సన్నిహితులు చెబుతున్నారు. అయినంత మాత్రాన, ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి చేరవేసే చిల్లర రాజకీయాలు దగ్గుబాటి దంపతులు చేయబోరని అంటున్నారు. నిబద్దత గల రాజకీయ నాయకుడిగా, దగ్గుబాటికి పేరుందని అదేశైలిలోనూ తన పంథా కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీగా నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు, ప్రాధమ్యాలను జనానికి వివరించడానికి, పార్టీ పట్టు పెంచుకోవడానికే దగ్గుబాటి తన కుమారుడితో కలిసి, పర్యటిస్తున్నారని వివరిస్తున్నారు. దగ్గుబాటిపై జగన్ నిఘా పెట్టారన్న వార్తల్లోనూ నిజం లేదన్నది దగ్గుబాటి అనుచరుల మాట. మొత్తానికి దగ్గుబాటిపై నిఘా పెరిగిందని ఒక వర్గం, నిఘాలేదు ఏమీ లేదని మరోవర్గం వాదిస్తున్నాయి. నిఘాపై అసలు నిజం పైవాడికే ఎరుక.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire