Irrigation Projects in AP: నిండుకుండల్లా జలాశయాలు.. కొనసాగుతున్న ఇన్ ఫ్లో

Irrigation Projects in AP: నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలోని రిజర్వాయర్లన్నీ జలాలాతో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కురవడం తో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టులకు అధికశాతంలో నీరు వచ్చి చేరింది.

Bathula Yesu Babu
Published on: 21 Sept 2020 8:19 AM IST
Irrigation Projects in AP:  నిండుకుండల్లా జలాశయాలు.. కొనసాగుతున్న ఇన్ ఫ్లో
X

Irrigation Projects in AP

Irrigation Projects in AP: నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలోని రిజర్వాయర్లన్నీ జలాలాతో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కురవడం తో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టులకు అధికశాతంలో నీరు వచ్చి చేరింది. అయితే అనుకోని విధంగా ఇన్ ఫ్లోలు పెరగడంతో నీటిని కిందకు వదలాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికి వర్షాలు కొనసాగుతుండటంతో కొన్ని ప్రాజెక్టులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు నదులు పోటెత్తాయి. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల్లోకి వరదనీరు భారీ ఎత్తున వస్తుండటంతో ఆయా నదులపై ఉన్న రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా వరదనీటితో తొణికిసలాడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని కండలేరు రిజర్వాయరు మినహా మిగిలిన రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటి నిల్వలతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే కృష్ణా, గోదావరి, వంశధార నదుల నుంచి 3000 టిఎంసిలకు పైగా వరదనీరు సముద్రం పాలైంది. కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం డ్యామ్‌లోకి 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా... దిగువకు నాగార్జునసాగర్‌ వైపు దాదాపు 3.5 లక్షల క్యూసెక్కులను అధికారులు వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ రిజర్వాయరులోకి 3.14 లక్షల క్యూసెక్కులు వస్తుండగా... దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి 3.21 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.

పులిచింతల ప్రాజెక్టులోకి 3.18 లక్షల క్యూసెక్కులు వస్తుండగా... ప్రకాశం బ్యారేజీ వైపు 3.23 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 4.43 లక్షల క్యూసెక్కులు వస్తుండగా... పంటకాలువల్లోకి 4,328 క్యూసెక్కులను వదిలి 4 లక్షల 44 వేల 640 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు నాలుగున్నర లక్షల క్యూసెక్కులను వదలడంతో దిగువన విజయవాడతోపాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గతేడాది కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి 798 టిఎంసిల నీరు సముద్రం పాలుకాగా, ఈ ఏడాది ఆదివారం నాటికే 339 టిఎంసిలు సముద్రం పాలయ్యాయి. గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గతేడాది 3,797 టిఎంసిల నీరు సముద్రంపాలు కాగా... ఈ ఏడాది ఇప్పటికే 2,631 టిఎంసిలు సముద్రంలో కలిసిపోయాయి. వంశధార నుంచి గతేడాది 134 టిఎంసిలు సముద్రంలో కలవగా... ఈ ఏడాది ఇప్పటికే 31 టిఎంసిలు వృథాగా సముద్రంలోకి కలిసిపోయాయి. ఈ ఏడాది కృష్ణా, గోదావరి, వంశధార నుంచి 3000 టిఎంసిల నీరు ఇప్పటికే వృథాగా సముద్రంలో కలిసిపోయాయి.

పెన్నా నదిపై ఉన్న సోమశిల రిజర్వాయరు పూర్తిస్థాయి నీటి నిల్వ అయిన 78 టిఎంసిలతో కళకళలాడుతుండగా, సోమశిలకు దిగువన ఉన్న కండలేరు రిజర్వాయరు 68 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 39 టిఎంసిలతో మాత్రమే ఉంది. పెన్నా నదిలో వరద ప్రవాహం లక్ష క్యూసెక్కులకు పైగా ఉండటంతో కండలేరు రిజర్వాయరు కూడా రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయి నీటి నిల్వలకు చేరుకునే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సాగునీటిని అందించే అన్ని రిజర్వాయర్లు సామర్థ్యం 960 టిఎంసిలు కాగా ప్రస్తుతం 882 టిఎంసిల నీరు రిజర్వాయర్లలో ఉంది.

Bathula Yesu Babu

Bathula Yesu Babu

Next Story