పుష్కర పనులు అధికారులకు పెద్ద సవాల్ గా మారాయి

Arun Chilukuri
Published on: 2 Oct 2020 4:38 PM IST
పుష్కర పనులు అధికారులకు పెద్ద సవాల్ గా మారాయి
X

తుంగభద్ర పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. కానీ పుష్కర పనులకు ఇప్పటికీ కొబ్బరికాయ కొట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం హడావుడిగా నిధులయితే మంజూరు చేసింది. పుష్కర పనులు అధికారులకు పెద్ద సవాల్ గా మారాయి. వేగంగా పూర్తిచేస్తే నాణ్యతలో తేడా వస్తుంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తే సమయానికి పనులు పూర్తి కావు. ఇప్పుడేం చేయాలో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

తుంగభద్ర పుష్కరాలు ఈ ఏడాది నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. 12రోజుల పాటు జరిగే పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అందుకు ప్రభుత్వ సకల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా వంద కోట్లు కేటాయించింది. ఏపీలోని కర్నూలులో 220 కిలోమీటర్లు మేర తుంగభద్ర తీరం ఉంది. ఆలూరు మండలం మేలనూరు వద్ద ప్రవేశించే తుంగభద్ర సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. పుష్కర భక్తులు ఈ తీరాలకే వస్తారు. దీంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

పుష్కర ఘాట్ నిర్మాణాలు, రహదారులు, ఇతర మరమ్మతులు చేసేందుకు టెండర్లు పిలవాలి. వాటిని పరిశీలించి ఖరారు చేయాలి. పనులు కేటాయించాలి. నిధులు మంజూరు చేయాలి. పనుల నాణ్యతను పరిశీలించాలి. ఇదంతా ఇప్పుడు ఏ మేర సాధ్యమవుతుందో అని అధికారులు తలమునకలు అవుతున్నారు. తుంగభద్ర పుష్కరాల పనుల కోసం అధికారులు ఓ పథకం సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా పుష్కర పనులు మూడు అంచెలుగా విభజించారు. తొలత అత్యంత అవసరంగా చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టారు. ఇందుకు 44.86 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండో దశలో తుంగభద్ర తీరంలోని 33 చోట్ల 59.౧౭ కోట్లతో స్నానపుఘాట్లను నిర్మించనున్నారు. మూడో దశలో 86.95కోట్లతో 35 పనులు చేపట్టనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story