పోలవరం గ్రామాలు.. ఆగస్టు నెల.. ముంచుకొచ్చే గోదారితో ముప్పు తిప్పలు !

Arun Chilukuri
Updated on: 20 Aug 2020 9:30 AM IST
పోలవరం గ్రామాలు.. ఆగస్టు నెల.. ముంచుకొచ్చే గోదారితో ముప్పు తిప్పలు !
X

Flood Affect in Hundreds of village at Polavaram: ఆగస్టు రాగానే ఆ ప్రాంతం అల్లకల్లోలం అవుతుంది. పోలవరం ముప్పు గ్రామాలను వరద నీరు ముప్ప తిప్పలు పెడుతుంది. ఊళ్లకు ఊళ్లను వరదనీరు ముంచెత్తుతుంది. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు నెత్తినోరు మొత్తుకున్నా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆ గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. చుట్టూ వరద నీరు ఉరకలేస్తున్నా చిమ్మని చీకట్లు కమ్మేస్తున్నా మాన్యం ప్రజలు మాత్రం మాట వినడం లేదు. ఇంతకీ ఆ గ్రామస్తులు ప్రమాద హెచ్చరికలను ఎందుకు లెక్కచేయడం లేదు. వరదనీటిలోనే ఎందుకు కాలం వెల్లదీస్తున్నారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దుగా ఉన్న గోదావరి వానకాలం రాగానే పరివాహక ప్రాంతాల ప్రజలను ముప్పతిప్పలు పెడుతుంది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం లంక గ్రామాలను గోదావరి జలధిగ్భందం చేస్తుంది. ఇప్పుడు కూడా లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు ఎంతచెప్పినా గ్రామస్తులు ససేమిరా అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలో సుమారు 36 గ్రామాలు ప్రతీ ఏటా వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇక మండలంలోని పూడిపల్లిలో 4 వందల కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ గ్రామానికి అతి సమీపంలో పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. దీంతో ఈ గ్రామంపై వరద ముప్పు మరింత పెరిగింది. ప్రతీ ఏటా అధికారులు ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తారు. కానీ గ్రామస్తులు మాత్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ విషయాన్ని తెరపైకి తీసుకువస్తారు.

పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదనలు చేసిన 2006 సంవత్సర గణాంకాలను బట్టీ అధికారులు అర్ ఆండ్ ఆర్ ప్యాకేజ్ అందిస్తున్నారు. చాలా మంది యువకులు పెళ్లిళ్లు చేసుకోవడంతో కుటుంబాల సంఖ్య పెరిగిందని వారికి అధిక ప్యాకేజ్ వర్తింపజేయాలని పూడిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. అది జరిగే వరకు వరదను సైతం లెక్కచేయకుండా ఇక్కడే ఉంటామని అంటున్నారు. నివాస ఇండ్లు వరద నీటిలో చిక్కుకున్నా అక్కడే ఉంటున్నారు తప్పా ఆ ప్రాంతాన్ని విడిచి బయటకు రావడం లేదు. చిమ్మని చీకట్లో చెట్ల కింద సేదతీరుతున్నారు. విద్యుత్ సౌకర్యం పూర్తిగా నిలిచిపోవడంతో దీపాలు వెలిగించేందుకు తమకు కిరోసిన్ అందిస్తే చాలని కోరుతున్నారు గ్రామస్తులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story