నేడు వైసీపీ ఇన్‌చార్జ్‌ల తుది జాబితా

YCP: అసెంబ్లీ, ఎంపీ స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు

Jyothi
Published on: 9 Jan 2024 10:06 AM IST
Final list of YCP in-Charges Today
X

నేడు వైసీపీ ఇన్‌చార్జ్‌ల తుది జాబితా

YCP: నేడు వైసీపీ ఇంఛార్జ్‌ల తుది జాబితా విడుదల చేయనుంది. అసెంబ్లీ, ఎంపీ స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 38 మంది ఇంఛార్జ్‌లను ప్రకటించింది. మరో 10 నుంచి 15 స్థానాల్లో మార్పు- చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఏలూరు, గుంటూరు, కర్నూలు ఎంపీ స్థానాలు సహా.. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలపై అధిష్టాన పెద్దలు కసరత్తు చేస్తున్నారు.

వైసీపీ మూడో లిస్ట్‌పై సీఎం జగన్‌ కసరత్తు చివరిదశకు చేరకుంది. రెండు విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన వైసీపీ.. ఇప్పుడు మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు.. ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై ఫోకస్‌ పెట్టింది. థర్డ్‌ లిస్ట్‌లో ఉండేది ఎవరు..ఊడేది ఎవరు..? సీటు ఎవరికి..షాక్‌ ఎవరికి..? వైసీపీ తుది జాబితాపై ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.

ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తోంది అధిష్టానం. నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు V.V.వినాయక్‌ను పోటీకి దించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుండి నటుడు అలీ, కాకినాడ నుండి చలమలశెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుండి చిన్న శీను, అనకాపల్లి నుండి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

విజయవాడ టికెట్‌ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా..అభ్యర్థిని ఇంకా ఫైనల్‌ చేయలేదని తెలుస్తోంది. విశాఖపట్నం పార్లమెంటు బరిలో బొత్స ఝాన్సీ, గుంటూరు నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావుపేట నుండి మోదుగుల వేణుగోపాలరెడ్డిలను ఓకే చేసే అవకాశం ఉంది. కర్నూల్ ఎంపీ బరిలో గుమ్మనూరి జయరామ్, నరసాపురం నుండి గోకరాజు రంగరాజు, రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, ఒంగోలు నుండి మడ్డిసెట్టి వేణుగోపాల్ లేదా విక్రాంత్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే బాపట్ల నుండి నందిగం సురేష్, తిరుపతి నుండి గురుమూర్తి, కడప నుండి అవినాష్ రెడ్డి, రాజంపేట నుండి మిథున్ రెడ్డిల పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టే. ఇక అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా శంకర్‌నారాయణ, హిందూపురం ఇన్‌ఛార్జ్‌గా శాంత, అరకు ఇన్‌ఛార్జ్‌గా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం.

అలాగే ఎంపీ సీట్లపై కూడా పలు సర్‌ప్రైజ్‌లు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకుంది.

Jyothi

Jyothi

Next Story