దివ్య తేజస్విని హత్యకేసు : నాగేంద్రని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

దివ్య తేజస్విని హత్యకేసు : నాగేంద్రని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
x
Highlights

దివ్య హత్యకేసులో నిందితుడు నాగేంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌ జైలులో నిందితుడు నాగేంద్రకు బీపీ, షుగరు టెస్టులతో పాటు కొవిడ్ టెస్టులు కూడా చేశారు.

దివ్య హత్యకేసులో నిందితుడు నాగేంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌ జైలులో నిందితుడు నాగేంద్రకు బీపీ, షుగరు టెస్టులతో పాటు కొవిడ్ టెస్టులు కూడా చేశారు. తనకు ఉన్న గాయాల గురించి నాగేంద్ర వైద్యులకు తెలియజేశారు. నాగేంద్రకు న్యాయమూర్తి కమలాకర్ ‌రెడ్డి 14రోజుల రిమాండ్ విధించారు. ఇక నిందితుడు నాగేంద్రను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిన్న జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయిన నాగేంద్రను.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం నిందితుడు నాగేంద్రను కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. సమగ్ర విచారణ కోసం వారం రోజుల పాటు నాగేంద్రను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

విజయవాడలోని క్రీస్తురాజపురానికి చెందిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని ప్రేమోన్మాది చేతిలో బలైన సంగతి తెలిసిందే. అదే ప్రాంతానికి చెందిన బుడిగ నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి ఆమెను కిరాతకంగా పొడిచి చంపేశాడు. అనంతరం తామిద్దరం వివాహం చేసుకున్నామని.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించామని చెప్పుకొచ్చాడు. అయితే ఆమెను ప్లాన్ ప్రకారమే నాగేంద్ర కిరాతకంగా చంపేసినట్లు పోలీసులు తేల్చారు.

ఆమె ఒంటిపై 13 కత్తిపోట్లు ఉండడం కూడా సంచలనంగా మారింది. ఆత్మహత్య చేసుకుంటే 13 కత్తిపోట్లు ఉంటాయా? అంటూ సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం బాధితురాలి కుటుంబాన్ని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories