నెల్లూరు జిల్లా రైతులకు దెబ్బ మీద దెబ్బ

Arun Chilukuri
Published on: 3 Dec 2020 4:45 PM IST
నెల్లూరు జిల్లా రైతులకు దెబ్బ మీద దెబ్బ
X

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయ్యింది నెల్లూరు జిల్లా రైతుల పరిస్థితి. మొన్నటి నివర్‌ తుపాను అల్లకల్లోలం సృష్టిస్తే ఇప్పుడు బురేవి రూపంలో మరో గండం ముంచుకస్తుంది. తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాన్ కల్లోలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో తెల్లవారుజామునుంచి వర్షం కురుస్తోంది. నివర్ తుఫాన్‌ కారణంగా జిల్లాలో వెయ్యి కోట్ల పంట నష్టం జరిగింది. ఇప్పుడు మళ్లీ వర్షం పడడంతో తీర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.

నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలోని అన్ని చెరువులు నిండిఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురిస్తే చెరువులకు గండ్లు పడడం ఖాయమని ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది.

మరోవైపు పెన్నా నది, కండలేరు, పంభలేరు, కైవల్య, కాళంగి, పైడేరు ఉగ్రరూపం దాల్చడంతో పలుచోట్ల నేషనల్‌ హైవేలు కూడా దెబ్బతిన్నాయి. నెల్లూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ఉన్నాయి. ఇక మళ్లీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఎంటని బాధితులు కన్నీటి పర్యాంతమవుతున్నారు.

వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ చక్రధర బాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story