కరోనా ఎఫెక్ట్ తొ ఆర్ధిక సంక్షోభంలో అన్నవరం దేవస్థానం!

Arun Chilukuri
Updated on: 3 Oct 2020 2:30 PM IST
కరోనా ఎఫెక్ట్ తొ ఆర్ధిక సంక్షోభంలో అన్నవరం దేవస్థానం!
X

కరోనా ఎఫెక్ట్ సత్యదేవునిపై పడింది. అన్నవరం ఆలయ ఆదాయం సన్నగిల్లింది. కనీసం ఉద్యోగులు, సిబ్బందికి పూర్తిస్థాయి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. భక్తులు రాక, ఆదాయం లేక ఆలయ నిర్వహణ కష్టమవుతుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరీ ఆలయానికి ఆర్థిక సంక్షోభం తీరేదెలా. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అధికారులు ఏం ప్లాన్ చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కొలువైన అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంపై కొవిడ్ ప్రభావం పడింది. కరోనా కారణంగా అన్నవరం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆలయ ఆదాయానికి గండిపడినట్లయింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలు, రత్నగిరి రూంల అద్దెలు, దర్శనాల టికెట్లు, ప్రసాదాల అమ్మకాలు, హుండీల ద్వారా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరేది. కరోనాకు ముందు ప్రతి రోజూ 25 నుంచి 35 లక్షల మధ్య ఆదాయం వచ్చేది. ప్రస్తుత 3లక్షలకే పరిమితమైంది.

ఇప్పుడస్తున్న ఆదాయం ఆలయ నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. అందుకే ఉద్యోగులకు, సిబ్బందికి సగం జీతం మాత్రమే చెల్లిస్తున్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో రెగ్యులర్ , పొరుగు, ఎన్ ఎంఆర్, లేబర్ కాంట్రాక్టు కింద మొత్తం 720మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక వ్రత పురోహితులకు, నాయీ బ్రహ్మణులకు టిక్కెట్ మీద కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వన్నీ లెక్కలు వేసుకుంటే జీతాలు, ఆలయ నిర్వహణ కోసం నెలకు మూడు కోట్ల ఖర్చు వస్తోంది.

ఇటీవల సత్యదేవుడి దర్శనం కోసం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంలో ఉద్యోగులు తమకు పూర్తి జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఈవోను నిలదీయగా బ్యాంకుల్లో ఉన్న స్వామివారి డిపాజిట్లను విత్ డ్రా చేస్తేనే జీతాలు ఇవ్వగలుగుతామని వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి దేవాదాయ కమిషనర్ కు లేఖ రాయాలని ఈవోను ఆదేశించారు. డిపాజిట్లను డ్రా చేసి జీతాలు చెల్లిస్తామని, పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్లీ డిపాజిట్ చేస్తామని ఈవో ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై కమిషనర్ ఎలాంటి ఆదేశాలు ఇస్తారో అని అధికారులు,ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story