Andhra Pradesh: ఏపీలో పరీక్షల నిర్వహణపై సందిగ్ధత

Andhra Pradesh: ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 11 Jun 2021 9:30 AM IST
Confusion over Conduct of Exams in Andhra Pradesh
X

Andhra Pradesh: ఏపీలో పరీక్షల నిర్వహణపై సందిగ్ధత

Andhra Pradesh: ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నెల రోజులుగా కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం ఈ నెల తర్వాత సడలింపులు కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో మళ్లీ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ మరోసారి చర్చనీయంగా మారింది. అయితే పరీక్షలు నిర్వహిండం మాత్రం పక్కా అని చెబుతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరి విద్యార్థులు ఏమంటున్నారు..? వారి తల్లిదండ్రులు ఏం చెబుతున్నారో చూద్దాం.

ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేస్తుంటే నిర్వహించి తీరుతామని చెబుతోంది ప్రభుత్వం. అయితే ఆన్‌లైన్‌ క్లాసులతో అంతంతమాత్రంగానే సాగుతోన్న చదువుతో విద్యార్థులు ఇప్పుడు పరీక్షలకు సిద్ధంగా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోవిడ్ కాస్త తగ్గినా మళ్లీ థర్డ్‌వేవ్‌ ముప్పు ఎప్పుడు ముంచుకొచ్చేది తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల నిర్వహణకు ఒప్పుకుంటారా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌ క్లాసులతో తమకు పాఠాలేమీ అర్థం కాలేదంటోన్న కొందరు స్టూడెంట్స్ ఇప్పుడు పరీక్షలకు సిద్ధంగా లేమని చెబుతున్నారు. మరికొందరు స్టూడెంట్స్‌ మాత్రం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తే తమకేం సమస్య లేదంటున్నారు.

అటు పేరెంట్స్‌ నుంచి కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థర్డ్‌వేవ్‌ కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో ఇప్పట్లో పరీక్షలు పెట్టొద్దంటున్నారు. ప్రత్యక్ష బోధన లేకుండా పరీక్షలు కరెక్ట్‌ కాదంటున్నారు. అయితే విద్యార్థి ప్రతిభ తెలుసుకోవాలంటే పరీక్షలు కూడా ముఖ్యమే కాబట్టి వ్యాక్సినేషన్ తర్వాత గానీ కొవిడ్‌ కేసులు తగ్గాక కానీ నిర్వహించాలని కోరుతున్నారు పేరెంట్స్‌. ఇక పిల్లలు ఇప్పటికే ఆన్ లైన్ విధానానికి అలవాటు పడిపోవడంతో వారికి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. టైమ్ స్లాట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించడం ద్వారా నెట్వర్క్ లో అవరోధాలు కూడా అధిగమించవచ్చని చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story