పందెంలో గెలిచిన పండగ కోడి

Arun Chilukuri
Published on: 14 Jan 2021 11:39 AM IST
cockfights organised in andhra pradesh
X

కోడి కాలు దువ్వుతుందా..? సంక్రాంతి బరులు తెగుతాయా? అసలు పందేలు జరుగుతాయా? అనే ఉత్కంఠను భోగి తీర్చేసింది. జరుగుతాయో లేదో అని ఊగిసలాట! ఊపందుకొని కోడి పందేలు ఉర్రూతలూగించాయి. పండగ తొలిరోజే కోట్లు కురిపించింది. పోలీసులు ఊరూవాడా తిరిగి హెచ్చరికలు చేసినా బరులను ధ్వంసం చేసినా, వేలాది కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నా, ఫైనల్‌గా పందెంలో పండుగ కోడి నిలిచింది. పోలీసుల భయంతో బరులను ఆలస్యంగా తెరిచినా కోడి జోరు ఏ మాత్రం తగ్గలేదు. బరులు తెరిచిన ప్రతి చోటా కోండిపందాలే కాదు గుండాట, పేకాటలు జరిగాయి. ఒక్కో కోడిపందెం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పలికింది.

బరుల బయట పైపందాలు ఒక్కోదానికి లక్షల రూపాయల చొప్పున చేతులు మారాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తొలిరోజు 20 కోట్లకు పైగా పందెం సాగినట్లు తెలుస్తోంది. కోడి పందెం చూడాలంటే కోడిపందాలకు పెట్టింది పేరుగా ఉన్న భీమవరం ఈసారి వెనుకబడింది. తొలిరోజు ఎక్కడా పందేలు జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాలో 150కు పైగా జరిగిన పందెం బరుల్లో సుమారు 25 కోట్లు చేతులు మారినట్టు అంచనా. గుండాటల బోర్డులు సైతం ఎక్కడికక్కడ వందల సంఖ్యలో వెలిశాయి. కోడిపందేల కంటే గుండాటలకు యువత ఆకర్షితులై వేలకు వేలు పెట్టి జూదక్రీడల్లో పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పుంజులు బస్తీ మే సవాల్‌ అంటూ బరుల్లోకి దిగాయి. బంటుమిల్లి, మచిలీపట్నం, కైకలూరు, కలిదిండి, గుడివాడ, నందివాడ, జగ్గయ్యపేట, వీరులపాడు, అంపాపురం ప్రాంతాల్లో బరులు తెరుచుకున్నాయి. గత ఏడాదికి మించి జిల్లాలో బరులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పెనమలూరు మండలం ఈడ్పుగల్లులో భారీస్థాయిలో కోడి పందాలు జరుగుతాయి. అంపాపురంలో బరులు మినీ స్టేడియంను తలపిస్తున్నాయి. అన్ని కార్యకలాపాలపై కరోనా ప్రభావం పడినప్పటికీ కోడి పందాలపై మాత్రం అది ఉన్నట్టు కనిపించడం లేదు. పందాలపై బెట్టింగ్‌లు లక్షల్లో సాగాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story