Revanth Reddy: దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్‌లో ప్రతిష్టితమైన మహాగణపతిని దర్శించుకున్నారు.

Arun Chilukuri
Published on: 5 Sept 2025 1:47 PM IST
Revanth Reddy: దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్‌లో ప్రతిష్టితమైన మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల ప్రాముఖ్యతను గుర్తు చేశారు.

‘‘71 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి కేవలం ఒక అడుగు గణపతితో ఉత్సవాలను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందాయి. నేటి ఆధునిక కాలంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ముందుకు సాగుతోంది,’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందించిందని, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు.

ఉత్సవాల విజయవంత నిర్వహణలో భాగస్వాములైన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులను సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story